ఇండియన్ క్రికెట్ టీమ్పై సీనియర్ల తలా ఓ మాట
ప్రపంచమంతా ఎప్పుడూ సక్సెస్ వెంటే పరిగెడుతుంది. గెలిచినప్పుడు జేజేలు కొట్టే జనం, ఓడినప్పుడు ఛీఛీ అంటారు. అంతేకాదు జట్టులో లోపాలు వెతుకుతారు. అదే గెలిచినప్పుడు మాత్రం ఎన్ని లోపాలున్నా పట్టించుకోరు. ఈ ప్రపంచానికి గెలుపే కావాలి. క్రికెట్ కూడా అందుకు మినహాయింపేం కాదు. ప్రస్తుతం టీమ్ ఇండియా పతనం వైపు వేగంగా పరుగులు తీస్తోంది. ఈ నేపథ్యంలో టీమ్ ఇండియా ఆట తీరుపై సీనియర్లు విమర్శలు ఎక్కుపెట్టారు. ఒకప్పుడు వాళ్లూ విఫల ఆటగాళ్లే, కానీ నేడు అవన్నీ మరిచిపోయారని కొందరు అంటున్నారు. ఇది నిజంగా దురదృష్టకరమని అంటున్నారు.
క్రష్ణమాచారి శ్రీకాంత్ ఏమన్నాడు…
ముఖ్యంగా మాజీ క్రికెటర్ క్రష్ణమాచారి శ్రీకాంత్ మాట్లాడుతూ శుభ్ మన్ గిల్ కి అనవసర ప్రాధాన్యత ఇస్తున్నారని సెలక్షన్ కమిటీపై మండిపడ్డాడు. అతను ఓవర్ రేటెడ్ క్రికెటర్ అని అన్నాడు. తనకన్నా టన్నుల కొద్దీ పరుగులు చేస్తున్న యువ క్రికెటర్లు రుతురాజ్ గైక్వాడ్, సాయి సుదర్శన్ ని ఎందుకు తీసుకోలేదని మండిపడ్డాడు.
విరాట్ కొహ్లీ ని తప్పించండి: ఇర్ఫాన్ పఠాన్
కొహ్లీ దేశవాళి క్రికెట్ ఆడి పదేళ్లవుతోంది. అతనెప్పుడో అలాంటి ఆట ఒకటుందనే మరిచిపోయాడు. ఈ పదేళ్లలో తన సగటు 30 మాత్రమే ఉంది. అయినా సరే, స్టార్ క్రికెటర్ ఫేమ్ తో జాతీయ జట్టులో కొనసాగుతున్నాడు. ముందీ స్టార్ కల్చర్ ఆపండి. లేకపోతే ఇండియన్ క్రికెట్ బాగుపడదని ఘాటుగా స్పందించాడు. ఇది వ్యక్తులకు సంబంధించినది కాదు, టీమ్ ఇండియాకి సంబంధించిన వ్యవహారమని అన్నాడు.
హర్భజన్ సింగ్ మాటేమిటంటే…
మాజీ స్పిన్నర్ హర్భజన్ సింగ్ మాట్లాడుతూ రాహుల్ ద్రవిడ్ ఉన్నప్పుడే టీమ్ ఇండియా మంచిగా ఆడిందని, గౌతం గంభీర్ వచ్చాక అంతా నాశనమైందని తిట్టిపోశాడు. అంతవరకు బాగానే ఉండి, కోచ్ వచ్చాక ఇలా జరగడంపై అందరూ ఆలోచించాల్సిన అవసరం ఉందని అన్నాడు.
యువరాజ్ సింగ్ మంచి మాట…
యువరాజ్ సింగ్ మాట్లాడుతూ రోహిత్ శర్మ, కొహ్లీలను ప్రజలు మరిచిపోవడం దారుణమని అన్నారు. వారిన్నాళ్లు భారతీయ క్రికెట్ కి చేసిన మేలు కొంతైనా గుర్తులేదా? అని ఆవేదన వ్యక్తం చేశాడు. మీకన్నా ఎక్కువగా వారిద్దరూ బాధపడుతూ ఉంటారని, యువరాజ్ తన మాజీ సహచరులను వెనకేసుకొచ్చాడు. ఈపాటికే బీసీసీఐతో జైషా చర్చించి ఉంటాడు. భారత జట్టు మళ్లీ విజయం వైపు నడిచేలా వారు చర్యలు తీసుకుంటారని ఆశిస్తున్నట్టు తెలిపాడు.
స్టార్ కల్చర్ కి తెరదించండి: పాకిస్తాన్ క్రికెటర్
అవకాశం దొరికితే చాలు, పాకిస్తాన్ మాజీలు టీమ్ ఇండియా జట్టుపై విమర్శలు గుప్పిస్తారు. సలహాలు ఇస్తుంటారు. ఈ నేపథ్యంలో కోచ్ గౌతంగంభీర్ కి మాజీ క్రికెటర్ బసిత్ ఆలీ ఒక సలహా ఇచ్చాడు. టీమ్ ఇండియాలో స్టార్ కల్చర్ కి తెరదించమని చెప్పాడు. అలాగైతేనే బాగుపడుతుందని తేల్చి చెప్పాడు.
అప్పుడు చూడండి: మహ్మద్ కైఫ్
మాజీ క్రికెటర్ మహ్మద్ కైఫ్ మాట్లాడుతూ త్వరలో జరగబోయే ఛాలెంజర్ ట్రోఫీని గెలిస్తే, ఈ పరాజయాన్ని అందరూ మరిచిపోతారని అన్నాడు. ఆటలో జయాపజయాలు కామన్ అని అన్నాడు. అయితే వరుసగా వైఫల్యాలు వస్తుంటే మాత్రం బోర్డు పెద్దలు, టీమ్ మేనేజ్మెంట్ అంతా కలిసి కూర్చుని, పరిష్కారం ఆలోచించాల్సిందేనని అన్నాడు.