భవిష్యత్తులో విద్యుత్ అవసరాలను తీర్చేందుకు, అంచనాలకు సరిపడా విద్యుత్ ఉత్పత్పిని చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం ముందుచూపుతో ప్రణాళికలు రూపొందిస్తోంది. ఇందులో భాగంగా గ్రీన్ ఎనర్జీ పాలసీ-2025ను తెలంగాణ ప్రభుత్వం సిద్ధంచేసింది. రాష్ట్ర ఉపముఖ్యమంత్రి, ఆర్థిక, ఇంధన, ప్రణాళిక శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క పర్యవేక్షణలో ఇంధన అవసరాలు తీర్చేలా సమగ్రమైన పాలసీకి రూపకల్పన చేశారు. ఈ గ్రీన్ ఎనర్జీ పాలసీని ఈనెల 9వ తేదీన ఆవిష్కరించనున్నారు.
ప్రధానంగా పునరుత్పాదక విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచడం, సమన్వయంగా అభివృద్ధి సాధించడమే లక్ష్యంగా ఈ కొత్త ఎనర్జీ పాలసీని రూపొందించారు. దీని ప్రకారం 2030 నాటికి 20 వేల మెగావాట్ల అదనపు పునరుత్పాదక విద్యుత్తు సామర్థ్యాన్ని సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ లక్ష్యాన్ని నెరవేర్చుకునేందుకు రాబోయే దశాబ్ద కాలంలో రూ.1.98 లక్షల కోట్ల పెట్టుబడులు, 1.14 లక్షల కొత్త ఉద్యోగ అవకాశాలు సృష్టించనుంది. కాలుష్య కారక తీవ్రతను 33% తగ్గించడమే ఈ విధానం లక్ష్యంగా పెట్టుకున్నారు.
ప్రస్తుతం రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలు, ప్రతిపాదిత ప్రాజెక్టులతో విద్యుత్ డిమాండ్ భారీగా పెరగనుంది. ప్రదానంగా ప్రభుత్వం చేపడుతున్న మెట్రో విస్తరణ, ఫార్మాసిటీ, ఏఐ సిటీ, రీజినల్ రింగ్ రోడ్డు వంటి పెద్ద ప్రాజెక్టులతో విద్యుత్తు డిమాండ్ గణనీయంగా పెరిగే అవకాశం ఉంది. ఇప్పుడు 2024-25లో గరిష్ట డిమాండ్ 15,623 మెగావాట్లుగా ఉండగా, 2034-35 నాటికి ఇది 31,809 మెగావాట్లకు చేరనుందని అంచనా వేస్తున్నారు.
గ్రీన్ ఎనర్జీ పాలసీని చేరుకోవడం కోసం ప్రైవేటు రంగానికి మరింత ప్రాధాన్యత ఇవ్వబోతుఉన్నారు. వివిధ ప్రాజెక్టులకు ప్రోత్సాహకాలు అందించడం. ఫ్లోటింగ్ సోలార్, విండ్ పవర్, గ్రీన్ హైడ్రోజన్, హైబ్రిడ్ ప్రాజెక్టులకు భారీగా సబ్సిడీలు, పన్ను మినహాయింపులు ఇవ్వనున్నారు. అలాగే, సౌర విద్యుత్తు, పవన విద్యుత్తు ప్లాంట్ల ఏర్పాటుకు ప్రైవేటు, ప్రభుత్వ స్థలాలు అందుబాటులోకి తీసుకువచ్చేందుకు ప్రణాళికలు రూపొందించారు. ప్రోత్సాహకాల్లో భాగంగా రూలింగ్ లీనియన్స్.. భూ వినియోగ మార్పులకు అనుమతి అవసరం లేదని, భూముల కొనుగోలుపైనా 100% స్టాంప్ డ్యూటీ రీయింబర్స్ అందించడం జరుగుతుందని ఈ పాలసీలో పేర్కొన్నారు. ఇక, ప్రత్యేకంగా మహిళలకు ప్రోత్సాహకం అందించాలని నిర్ణయించారు. మహిళా స్వయం సహాయక సంఘాలకు 500 కిలోవాట్ల నుండి 2 మెగావాట్ల దాకా విద్యుత్ ప్లాంట్ల ఏర్పాటుకు ఆర్థిక సహాయం అందించనున్నారు. వీటితో పాటు.. రూఫ్టాప్ ప్రాజెక్టులు చేపట్టనున్నారు. ప్రభుత్వ పాఠశాలలు, ఇందిరమ్మ ఇళ్లు, పంచాయతీ భవనాలపై రూఫ్టాప్ సోలార్ ప్లాంట్ల ఏర్పాటుకు ప్రోత్సాహం ఇవ్వనున్నారు. అలాగే, పెట్టుబడులకు వేగవంతమైన అనుమతులు అందించడం, దీనికోసం టీజీ-ఐపాస్ ద్వారా అన్ని రకాల అనుమతులు వేగంగా జారీ చేయాలని నిర్ణయించారు. వీటికి పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఎన్వోసీ కూడా అవసరం లేదని కొత్త ఎనర్జీ పాలసీలో స్పష్టంగా పేర్కొన్నారు. తెలంగాణలో ఉన్న అనుకూల వాతావరణ పరిస్థితులు సౌర, పవన విద్యుత్తు ఉత్పత్తికి సహకరించే పరిస్థితులు ఉన్నాయి. 300 రోజులు సౌర విద్యుత్తు అందుబాటులో ఉండే రాష్ట్రం, గాలులు బలంగా వీచే 8 రాష్ట్రాల్లో ఒకటిగా ఉన్న తెలంగాణలో రూపొందించుకున్న లక్ష్యాలు కచ్చితంగా నెరవేరతాయని అంచనా వేస్తున్నారు. ఈ కొత్త పాలసీ ద్వారా తెలంగాణ గ్రీన్ ఎనర్జీ సెక్టార్లో దేశవ్యాప్తంగా కీలక ప్రదేశంగా మారనుందని అనుకుంటున్నారు. సమన్వయ అభివృద్ధి లక్ష్యంతో పాటు పర్యావరణ రక్షణకు దోహదపడే ఈ విధానం రాష్ట్రాన్ని ఒక నూతన శక్తిగా మార్చుతుందని ప్రభుత్వం ధీమా వ్యక్తం చేస్తోంది.