అంతర్జాతీయ క్రీడాకారులు ఆడే స్థాయిలో మనవాళ్లు ఆడటం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఇంత గొప్ప ఆటగాళ్ళు కూడా గల్లీ క్రికెట్ స్థాయిలో ఆడటంపై క్రికెట్ అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు .
జాతీయ జట్టు ఆటగాళ్లు ఆడుతున్న ఆట తీరు చూస్తుంటే..అసలు ఆటే తెలీదు అన్నట్టు…అసలు ఆస్ట్రేలియా ఎప్పుడు వెళ్ళలేనట్టు… ఆడుతుంటే అందరూ అయోమయానికి గురవుతున్నారు.
బోర్డర్ గవాస్కర్ సిరీస్ లో ఆఖరి టెస్ట్ మ్యాచ్ జరుగుతోంది . త్వరలో జరగబోయే వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ ఫైనల్ కి అర్హత సాధించాలంటే ఈ మ్యాచ్ గెలవడం అత్యంత కీలకంగా మారింది. ఇలాంటి పరిస్థితుల్లో కూడా వీళ్ళు ఆడకపోతే ఎలా? అని సగటు భారత అభిమానులు ఎంతో బాధపడుతున్నారు. చివరి టెస్ట్ తొలి ఇన్నింగ్స్ లో చాపచుట్టేసిన మనవాళ్ళకి, బౌలర్లు మ్యాచ్ నిలబెట్టి మళ్లీ ఆశలు రేపారు. కానీ బ్యాటర్లు మాత్రం టప టపా పడిపోయి నీరుగార్చేస్తున్నారు.
మొత్తానికి అందివచ్చిన అవకాశాన్ని నిలబెట్టుకోలేదు. సెకండ్ ఇన్నింగ్స్ లో యథా రాజా తథా ప్రజా అన్నట్టు… ఆ కోచ్ గంభీర్ ఎలా ఉన్నాడో…జట్టులో ఆటగాళ్లు కూడా అంతకన్నా అధ్వానంగా ఉన్నారు . దీంతో రెండో ఇన్నింగ్స్ లో కూడా పట్టు జారిపోయినట్టే కనిపిస్తోంది. తొలి ఇన్నింగ్స్ లో భారత్ 185 పరుగులకు ఆల్ అవుట్ అయ్యింది. అనంతరం బ్యాటింగ్ ప్రారంభించిన ఆస్ట్రేలియా కూడా అంతకుమించి ఘనంగా ఆడలేదు.181 పరుగులకు ఆల్ అవుట్ ఆయ్యింది. దీంతో ఎంతో ఆశావాహ దృక్పథంతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన టీమిండియాకు ఆశాభంగమే అయ్యింది. రెండో రోజు ఆట ముగిసే సమయానికి ఆరు వికెట్ల నష్టానికి 141 పరుగులతో పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయింది.
ప్రస్తుతం తొలి ఇన్నింగ్స్ నాలుగు పరుగుల లీడ్ తో కలిపి 145 పరుగులతో పడుతూ లేస్తూ ముందుకు సాగుతోంది. ఒక మ్యాచులో సెంచరీ చేసి హీరో అయిన నితీష్ కుమార్ వరుస పెట్టి ఫెయిల్ అవడంతో భారత శిబిరంలో ఆందోళనలు మొదలవుతున్నాయి. అయితే అంతకుమించి.. విరాట్ కోహ్లీ మీద పెట్టుకున్న ఆశలన్నీ నీరు గారిపోయాయి.బహుశా రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ఇద్దరూ కూడా టెస్ట్ మ్యాచ్ లకి రిటైర్మెంట్ ప్రకటిస్తారేమోనని అందరూ భావిస్తున్నారు.
అయితే విరాట్ , రోహిత్ ఇద్దరూ కూడా ఫ్యామిలీలకే అంకితం అయిపోవడంతో ఆటకు దూరమైపోయారనే విమర్శలు గట్టిగానే వినిపిస్తున్నాయి. మాట్లాడితే చాలు విరాట్ కోహ్లీ లండన్ పారిపోవడం , రోహిత్ శర్మ కారేసుకొని 200 కిలోమీటర్లు స్పీడ్ తో డ్రైవింగ్ చేయడం ఇవే వీళ్ళు చేసే పనులుగా ఉన్నాయని నెటిజన్లు సీరియస్ అవుతున్నారు.