ఫార్ములా ఈ-రేస్ కేసులో కేటీఆర్ రోజుకో మాట మాట్లాడుతూ కోర్టులను కూడా తప్పుదోవ పట్టిస్తున్నాడని తెలంగాణ ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ అలీ విమర్శించారు. కేసీఆర్ ఫ్యామిలీ ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఐఏఎస్లను కూడా కేటీఆర్ బకరాలను చేశాడని, మొదట అధికారులకు తానే ఆదేశాలిచ్చానని చెప్పిన కేటీఆర్.. కోర్టులో మాత్రం.. తమకేమీ సంబంధం లేదని, అధికారులే చూసుకోవాలని మాట మారుస్తున్నాడని విమర్వించారు. ప్రభుత్వానికి ప్రజలు ఐదేళ్ల సమయం ఇచ్చారని, బీఆర్ఎస్ నేతలు ఎంతగా తాపత్రయపడినా ఏమీ చేయలేరన్నారు. కేటీఆర్కు ఓపెన్ ఛాలెంజ్ విసిరారు. ఉద్యమం సమయంలో ఆస్తులు అమ్ముకున్న కేసీఆర్ ఫ్యామిలీకి, 2009 నుంచి 2014లో ఆస్తులు ఎలా పెరిగాయని ప్రశ్నించారు. కేసీఆర్, కేటీఆర్, కవిత, హరీష్రావు ఆస్తులు ఏకధాటిగా పెరుగుతూనే ఉన్నాయని, కేసీఆర్ దగ్గర అల్లాద్దీన్ అద్భుతదీపం ఏమైనా ఉందో చెప్పాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో మిగతా నాయకులందరూ ప్రతీ ఎన్నికల్లో ఆస్తులు అమ్ముకుంటూంటే బీఆర్ఎస్ నేతల ఆస్తులు మాత్రం ప్రతీ ఎన్నికల్లోనూ పెరుగుతూనే ఉన్నాయని అవి ఎలా పెరుగుతున్నాయో ప్రజలకు సమాధానం చెప్పాలన్నారు. తెలంగాణలో లిక్కర్ రాణి కవిత ఇచ్చిన లిక్కర్ సప్లై పర్మిషన్ లతోనే క్రైమ్ రేట్ పెరుగుతోందన్నారు.