- 333 పరుగులతో… ఆస్ట్రేలియా
- రాణించిన బుమ్రా, సిరాజ్
మెల్ బోర్న్ లో ఆస్ట్రేలియాతో జరుగుతున్న నాలుగో టెస్టులో టీమ్ ఇండియా విజయావకాశాలు మళ్లీ క్లిష్టంగా మారుతున్నాయి. నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి ఆస్ట్రేలియా 9 వికెట్ల నష్టానికి 333 పరుగులతో పటిష్ట స్థితిలో ఉంది. మరి మ్యాచ్ చివరి రోజు డిక్లేర్ చేస్తారా? లేక 400 పరుగులు చేసి ఆగుతారా? అనేది పిచ్ కండీషన్ ని బట్టి నిర్ణయం తీసుకుంటారని క్రికెట్ నిపుణులు చెబుతున్నారు.
ఇకపోతే నాలుగో రోజు ఆట ప్రారంభమైన కాసేపటికి టీమ్ ఇండియా ఆల్ అవుట్ అయ్యింది. నితీశ్ కుమార్ (114) చివరి వికెట్ గా వెనుతిరిగాడు. సిరాజ్ (4) నాటౌట్ గా నిలిచాడు. మొత్తానికి 369 పరుగుల వద్ద టీమ్ ఇండియా తొలిఇన్నింగ్స్ ముగిసింది. మొత్తానికి ఆస్ట్రేలియాకి 105 పరుగుల ఆధిక్యం లభించింది.
దీంతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన ఆస్ట్రేలియా దూకుడుగా ఆడింది. దీంతో వికెట్లు ఫటాఫటా పడ్డాయి. అలా మొదటి ఇన్నింగ్స్ లో బుమ్రా బౌలింగులో రెండు సిక్సర్లు కొట్టిన కుర్ర ఆటగాడు కొన్ స్టాస్ వికెట్ తీసి తన సత్తా చూపించాడు. బుమ్రాతో పెట్టుకుంటే ఏమవుతుందో అర్థమయ్యేలా చేశాడు.
ఈసారి సిరాజ్ అందుకున్నాడు. తను ఖవాజా (21), లబుషేన్ (70), స్టీవ్ స్మిత్ (13) వికెట్లను తీసి టీమ్ ఇండియాలో ఆత్మస్థయిర్యం నింపాడు. అయితే బుమ్రా ఊరుకుంటాడా…తను నాలుగు వికెట్లు తీశాడు. ట్రావిస్ హెడ్ (1), మార్ష్ (0), అలెక్స్ కారీ (2), కొన్ స్టాస్ (8) వికెట్లు తీశాడు. కెప్టెన్ ప్యాట్ కమిన్ (41) వికెట్ ను రవీంద్ర జడేజా తీశాడు. మిచెల్ స్టార్క్ (5) ని నితీష్ రన్ అవుట్ చేశాడు.
అయితే 9 వికెట్లతో ఆస్ట్రేలియా పతనం దిశగా సాగిపోయింది. ఒక్క వికెట్ తీస్తే అంతా అయిపోయేదని అనుకున్నారు. కానీ నాథన్ లయన్ (41), స్కాట్ బోలాండ్ (10) నాటౌట్ గా నిలిచి భారత ఆశలపై నీళ్లు చల్లారు. ఇక చివరి వికెట్ తీయలేక భారత బౌలర్లు అపసోపాలు పడ్డారు. మొత్తానికి ఆఖరి ఓవర్ లో బుమ్రా బౌలింగులో లయన్ అవుట్ అయ్యాడు గానీ, అది నోబాల్ కావడంతో అందరూ ఉసూరుమన్నారు. చివరికి 9 వికెట్ల నష్టానికి ఆస్ట్రేలియా 333 పరుగుల వద్ద నిలిచింది.
మరి ఆస్ట్రేలియా ఐదోరోజు ఆట కొనసాగిస్తుందా? లేక డిక్లేర్ చేస్తుందా? అనే అంశంపై స్పష్టత లేదు. కనీసం 350 నుంచి 400 పరుగులు చేసి డిక్లేర్ చేస్తుందని అనుకుంటున్నారు. మరి మన వీరాధివీరులు ఎలా ఆడతారనే దానిపై అందరిలో ఎన్నో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఒకరకంగా చెప్పాలంటే ఆస్ట్రేలియాకి ఏదోరకంగా గట్టిపోటీ ఇస్తుందని మాత్రం అంటున్నారు.