ప్రముఖ సినీ దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. ఇటీవల తెలుగు సినిమా ప్రముఖులు కొందరు తెలంగాణ ముఖ్యమంత్రి, ఉపముఖ్యమంత్రి, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రిని కలిసిన విషయంపై మాట్లాడారు. అది ఇండస్ట్రీ మీటింగ్ కాదని, ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ తరపున దిల్రాజు కొందరిని ప్రభుత్వం దగ్గరికి తీసుకెళ్లిన సందర్భం మాత్రమే అన్నారు. ఎఫ్డీసీ పని జనాలను కో-ఆర్డినేట్ చేయడం వరకే అని సంచలన కామెంట్స్ చేశారు. తనకు ఆ సమావేశం గురించి ఆహ్వానం అందలేదన్నారు. వ్యక్తిగతంగా కొందరు కలిశారని, అల్లు అర్జున్ వివాదం సమసిపోయిందని, పుష్ప-2తో ఏర్పడిన గ్యాప్ పోయిందన్నారు. సినిమా ఇండస్ట్రీ అంటే ఛాంబర్ ఒక్కటే అన్న తమ్మారెడ్డి భరద్వాజ.. అన్ని సెక్టార్స్ కలిపితేనే ఇండస్ట్రీ అని.. ఇవన్నీ ఛాంబర్ కిందే ఉంటాయని స్పష్టం చేశారు.
సినిమాలు తీసే నిర్మాతల సమస్యలు, వాటి పరిష్కారం కోసం మాత్రమే ప్రభుత్వ పెద్దల దగ్గరికి వెళ్లారన్నారు. బెనిఫిట్ షోలు వద్దని తాను మొదటినుంచీ చెప్తూనే ఉన్నానన్న భరద్వాజ.. ప్రీమియర్స్ వేసుకోవచ్చు కానీ, బెనిఫిట్స్ షోలు వద్దన్నారు. టికెట్ రేట్లు పెంచుకుంటామంటూ సీఎం దగ్గరికి వెళ్లి దేహీ.. అని అడుక్కోవడం కరెక్ట్ కాదని హితవు పలికారు. టాలీవుడ్ ఇప్పటికే వరల్డ్ రికార్డ్స్ లోకి వెళ్ళిపోయిందని, మన దగ్గర అన్ని భాషల సినిమాలు షూటింగ్లు జరుగుతున్నాయని అన్నారు. సమాజానికి ఉపయోగపడే కార్యక్రమాలకు సినిమా వాళ్ల మద్దతు ఉండాల్సిందేనన్నారు. ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్స్ ఇక్కడ జరగాలంటే హైదరాబాద్లోనే ఆఫీసులు ఉండాలన్నారు. పిల్లలు తప్పు చేస్తే ఎలా జాగ్రత్తలు చెప్తామో అలాగే అల్లు అర్జున్ కి కూడా చెప్పానన్నారు. ఇప్పుడున్న కుర్ర హీరోలు ఎదిగిపోయాక వాళ్ళ చుట్టూ కోటరీలు ఉంటాయని, వాళ్ళు సీనియర్స్ మాటలు వినే పరిస్థితి లేదని, ఆ పద్ధతి మారాలని సూచించారు.