హైడ్రా ఏర్పడి దాదాపు 5 నెలలు దాటిందని, ఐదు నెలల అనుభవాలు, వచ్చే ఏడాది రూట్ మ్యాప్ సిద్దం చేశామని హైడ్రా కమిషనర్ రంగనాథ్ తెలిపారు. ఓఆర్ ఆర్ వరకు హైడ్రా పరిధి ఉందని, జీహెచ్ ఎంసీ చట్టం కింద ప్రభుత్వం ప్రత్యేక అధికారాలు ఇచ్చిందని పేర్కొన్నారు. 200 ఎకరాల ప్రభుత్వ భూమిని రక్షించామన్నారు.
హైదరాబాద్ లో శనివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో హైడ్రా కమిషనర్ రంగనాథ్.. హైడ్రా పనితీరు వెల్లడించారు. 12 చెరువులు, 8 పార్కులను అన్యక్రాంతం కాకుండా హైడ్రా రక్షించిందన్నారు. ఎఫ్ టీఎల్, బఫర్ జోన్ పై ప్రజల్లో అవగాహన పెరిగిందన్నారు.
1095 చెరువుల్లో వచ్చే ఏడాది ఎఫ్ టీఎల్ నిర్దారణ చేస్తామన్న రంగనాథ్…సాంకేతిక పరిజ్ఞానం, డాటాతో ఎఫ్ టీఎల్ నిర్దారణ చేస్తామన్నారు. ఎఫ్ టీఎల్ ను పారదర్శకంగా చేయడం మా బాధ్యత అని స్పష్టం చేశారు. శాటిలైట్ ఇమేజ్ తో అత్యంత రెజల్యూషన్ ఉన్న డేటా తీసుకుంటున్నామన్నారు.
2006 నుంచి 2023 వరకు ఏరియల్ డ్రోన్స్ తో తీసిన ఫొటోలను కూడా ఎఫ్ టీఎల్ నిర్దారణ కోసం తీసుకుంటున్నామని, ఎఫ్ టీఎల్ మారడానికి గల కారణాలు స్పష్టంగా తెలుస్తుందని రంగనాథ్ పేర్కొన్నారు. శాస్త్రీయమైన పద్దతుల్లోనే ఎఫ్ టీఎల్ నిర్దారణ జరుగుతుందన్నారు.
నాలాలపై కిర్లోస్కర్ కంపెనీ చేసిన స్టడీని తీసుకుంటున్నామని, 5800 ఫిర్యాదులు హైడ్రాకు అందాయని రంగనాథ్ తెలిపారు. అనధికారిక నిర్మాణాలకు సంబంధించి 27 పురపాలక సంఘాల నుంచి ఫిర్యాదులు వస్తున్నాయన్నారు. 27 పురపాలక సంఘాలపై కూడా మాకు అధికారం ఉందన్నారు.
శాటిలైట్ ఇమేజ్ ల ద్వారా ఆక్రమణలను గుర్తిస్తున్నామని, భవన నిర్మాణ వ్యర్థాల డంపింగ్ పై కుడా దృష్టి పెట్టామని రంగనాథ్ వెల్లడించారు. 2025లో జియో ఫెన్సింగ్ సర్వే ద్వారా 12 చెరువుల పునరుద్దరణకు సంబంధించిన ప్రతిపాదనలు ప్రభుత్వానికి పంపామన్నారు.
త్వరలోనే 72 డీఆర్ ఎఫ్ బృందాలు అందుబాటులోకి వస్తాయని, నాగోల్ లో ఉన్న డీఆర్ ఎఫ్ కేంద్రాన్ని బలోపేతం చేస్తామని రంగనాథ్ వివరించారు. త్వరలోనే నగరంలో మరో డాప్లర్ వెదర్ రాడార్ రాబోతుందన్నారు. వెదర్ డాటాను విశ్లేషించేందుకు హైడ్రాలో ఒక టీంను ఏర్పాటు చేస్తున్నామన్నారు.
హైడ్రాకు త్వరలో ఒక ఎఫ్ ఎం ఛానల్ కు ప్రయత్నిస్తున్నామని, హైడ్రా వల్ల ప్రజల్లో భూములు, ఇల్లు క్రయవిక్రయాలపై అవగాహన పెరుగుతోందని హైడ్రా కమిష్ నర్ తెలిపారు. నగరంలో అక్రమ నిర్మాణాల కూల్చివేతలపై హైడ్రా కఠినంగానే ఉంటుందన్నారు. జులై తర్వాత అనధికారికంగా, వ్యాపార వాణిజ్య కార్యకలాపాలు నిర్వహించేవాటిపై చర్యలు తప్పవని హెచ్చరించారు.
వచ్చే ఏడాది నుంచి ప్రతిసోమవారం గ్రీవెన్ సెల్ ఏర్పాటు చేస్తున్నామని రంగనాథ్ వెల్లడించారు. ఎఫ్ టీఎల్ లో ఉన్న షెడ్లపై ప్రజలెవరు అద్దెకు తీసుకోవద్దన్నారు. ప్రజల ఇచ్చే ఫిర్యాదులకు ప్రాధాన్యత ఇచ్చి పరిష్కరిస్తున్నామని హైడ్రా కమిషనర్ రంగనాథ్ తెలిపారు.