ఆర్థిక సంస్కరణల ద్వారా నవభారతాన్ని నిర్మించిన శిల్పి మాజీ ప్రధాని డాక్టర్ మన్మోన్ సింగ్ అని తెలంగాణ డిప్యూటీ సీయం మల్లు భట్టి విక్రమార్క కొనియాడారు. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మృతి పట్ల ఆయన తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ గా, ప్లానింగ్ కమిషన్ డిప్యూటీ ఛైర్మన్ గా, ఆర్థిక శాఖ, అణుశక్తి, అంతరిక్ష కమిషన్, ప్రధాని ఆర్థిక సలహాదారుడుగా, ఆర్థిక మంత్రిగా, ప్రధానిగా దేశానికి ఎనలేని సేవలు చేసిన నాయకుడు మన్మోహన్ సింగ్ అని ఆయన చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు డిప్యూటీ సీయం. సరైన సమయంలో దేశం ఆర్థిక సంక్షోభంలో పడకుండా కాపాడిన దార్శనికుడు మన్మోహన్ సింగ్ అని అన్నారు. వివాదాలు, విమర్శలకు తావు లేకుండా రాజకీయ జీవితం ఎలా ఉండాలో మన్మోహన్ సింగ్ తన ప్రవర్తన ద్వారా ప్రపంచానికి చూపించారని భట్టి అన్నారు. జాతీయ ఉపాధి హామీ పథకం, ప్రత్యేక ఆర్థిక మండళ్ల విస్తరణ, సమాచార హక్కు చట్టం, గృహహింస చట్టం, అమెరికాతో అణు ఒప్పందం, చంద్రయాన్, మంగళ్యాన్, 2013 భూ సేకరణ చట్టం, ఎన్ఐఏ ఏర్పాటు, విద్యాహక్కు చట్టం, ఆహార భద్రత చట్టం, ఆధార్ కార్డుల రూపకల్పన ఎన్నో కీలకమైన దశలలో ఆయన ఆలోచనలు ఈ దేశ పునర్నిర్మాణానికి తోడ్పడ్డాయి. వారి మృతి ఈ దేశానికి, కాంగ్రెస్ పార్టీకి తీరని లోటని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అన్నారు.