మన్మోహన్ పూర్తి శాఖా హారి. భోజనంగా కేవలం పెరుగన్నం, అప్పడం,దానిమ్మ గింజలు ఎక్కువగా తినేవారు. పరిమితమైన డైట్ పాటించేవారు. ఇక ఇష్టమైన వంటకాల్లో ఆయనకు నచ్చేది యోగార్ట్ తో తయారు చేసిన కడీ చావల్. అనేక పరిశోధనలు కూడా శాఖా హార మే మంచిదని చెబుతున్నాయని అందుకే తాను శాకాహారమే తింటాననీ అనేవారు.
కానీ 2011లో ఆయన బంగ్లాదేశ్ వెళ్లినప్పుడు తన నియమాన్ని బ్రేక్ చేశారు. ఆయన మనసుని దోచినది ఓ బెంగాలీ ఫిష్.. హిల్సా అనే రకం చేపతో తయారు చేసిన ఓ పసందైన వంటకాన్ని అక్కడి వారు వడ్డించారు. అది బెంగాలీ సంస్కృతికి, సంప్రదాయానికి నిదర్శనమైన వంట అని అందుకే దానిని వడ్డించామని చెప్పడంతో తన శాకాహార నియమాన్ని పక్కన పెట్టి ఆ వంటకాన్ని ఆరగించారు. కేవలం ఆ డిష్ గురించి తెల్సుకుని అలా తన మెనూ మార్చుకున్నారు.
మారుతీ సుజుకీ లవర్..
మాజీ ప్రధాని మన్మోహన్ దేశ అత్యున్నత పదవిని క్లిష్ట పరిస్థితుల్లో చేపట్టిన సింప్లిసిటీని ఇష్టపడే వ్యక్తి. హంగు, ఆర్భాటాలకు దూరం. ప్రశాంత జీవనాన్ని ఇష్టపడతారు. ప్రధాని హోదాలో ఎస్పీజీ సెక్యూరిటీతో బీఎండబ్ల్యూ కార్లలో ప్రయాణించినా ఆయన ఇష్టపడేది మధ్యతరగతి కారు మారుతి సుజుకి 800 మాత్రమే. సామాన్యుడి కారుగా పేరుపడిన ఈ కారు ఆయన కష్టార్జితంతో కొనుక్కున్నది. రాజకీయాల్లోకి రాక ముందు అదే కారు వాడారు. పదవీ విరమణ చేసిన తర్వాత కూడా అదే కారును ఆయన వినియోగించారు. ప్రధాని నివాసంలో బీఎండబ్ల్యూ కార్ల శ్రేణి వెనకాల సెక్యూరిటీ ఈ కార్ ను పార్క్ చేసి ఉంచేవారు. సాధారణంగా అంత పెద్దపదవి చేపట్టిన వాళ్లు లైఫ్ స్టైల్ కూడా మార్చేస్తారు. కానీ ఆయన మాత్రం అందుకు పూర్తి విరుద్ధం. ఇంటి నుంచి బయటకు వచ్చినప్పుడల్లా తన కారు మారుతిని ఆప్యాయంగా చూసుకునేవారు. సెక్యూరిటీ కారణాల వల్ల బీఎం డబ్ల్యూ వాడాల్సిందేనని ఎస్పీజీ సిబ్బంది ఒత్తిడి మేరకే ఆ సెక్యూరిటీ కార్లలో వచ్చేవారు. పదవీ విరమణ తర్వాత కూడా తన పాత కారును ఆయన వదలలేదు. ఆయన సంప్లిసిటీకి ఇదే నిదర్శనం.