26.1 C
Hyderabad
Friday, August 7, 2026

Live Video

spot_img

బీఆరెస్ పాలనలో 6,121 మంది రైతుల ఆత్మహత్యలు – మంత్రి శ్రీధర్ బాబు

  • మీరు చేసిన తప్పులు మేము సరిచేస్తున్నాం
  • రైతు బంధు పేరులో అనర్హులకు దోచిపెట్టారు
  • మంచి పనులకు మద్దతుగా నిలిచి మీ పాపాలు కడుక్కోండి
  • బీఆర్ఎస్ నేతలకు దుద్దిళ్ళ శ్రీధర్ బాబు హితవు 

పదేళ్ల పాలనలో ఓటు బ్యాంకు రాజకీయాలతో రైతులను మోసగించిన బీఆర్ఎస్ నేతలు ఇప్పుడు దొంగ ప్రేమను ఒలకబోస్తున్నారని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతు బంధు పేరిట బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన తప్పులను ‘రైతు భరోసా’  పేరుతో సరిదిద్ది రైతులకు సాయం చేసేందుకు మా ప్రజా ప్రభుత్వం ప్రయత్నిస్తోందని శ్రీధర్ బాబు అన్నారు. మీరు చేసిన తప్పులు మేం సరిచేస్తుంటే అభినందించాల్సింది పోయి అసత్యాలతో ప్రజలను ఇంకా మభ్య పెట్టాలని చూడటం సమంజసం కాదని మంగళవారం నాడు శ్రీధర్ బాబు ఒక ప్రకటనలో ఆగ్రహం వ్యక్తం చేశారు. గడచిన పదేళ్ల లో రియల్ ఎస్టేట్ వ్యాపారులకు, ప్రభుత్వం నష్ట పరిహారం ఇచ్చి సేకరించిన భూములకు, సాగులో లేని రాళ్ల గుట్టలకు ‘రైతు బంధు’ పేరిట దోచి పెట్టిన ఘనత బీఆర్ఎస్ ప్రభుత్వానికే దక్కిందంటూ ఆయన ఎద్దేవా చేశారు. 2018-19 నుంచి 2022 2023 వరకు రూ.25,672 కోట్ల నిధులను సాగులో లేని భూములకు చెల్లించారని ఒక్కసారి వెనక్కి తిరిగి, మీ పాలనలో రైతులు ఎంత ఇబ్బంది పడ్డారో చూసుకోవాలని శ్రీధర్ బాబు హితవు పలికారు. ముఖ్యంగా కౌలు రైతుల పరిస్థితి అత్యంత దారుణంగా ఉండేదని వివరించారు. వ్యవసాయం గిట్టుబాటు కాక ఆత్మహత్య చేసుకున్న రైతుల కుటుంబాల ఉసురు తగిలే, మీరు అధికారం కోల్పోయారని గుర్తుంచుకోవాలన్నారు. 2014-2022 వరకు తెలంగాణాలో 6,121 మంది అన్నదాతలు అప్పులు తీర్చలేక ఆత్మహత్యలకు పాల్పడిన విషయాన్ని మర్చి పోతే ఎలా ఆయన ప్రశ్నించారు. నేషనల్ క్రైం రికార్డ్స్ బ్యూరో లెక్కల ప్రకారం ఈ బలవన్మరణాల అంకెలను 2022 లో కేంద్ర ప్రభుత్వం పార్లమెంటులో వెల్లడించిందన్నారు. ఇప్పటికైనా కళ్లు తెరిచి ప్రజా ప్రభుత్వం చేస్తున్న మంచి పనులకు మద్దతుగా నిలిచి మీరు చేసిన పాపాలను కడుక్కోవాలని శ్రీధర్ బాబు బీఆర్ఎస్ నాయకులకు సూచించారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని మీరు అప్పుల కుప్పగా మార్చి దిగిపోయినా రైతులకు ఇచ్చిన మాట మేరకు ఏక కాలంలో రూ. 21 వేల కోట్లు రుణమాఫీ చేశామని గుర్తు చేశారు. మీడియాలో కనిపించడం మానుకుని ప్రజల మధ్యకు వెళ్లి వారు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం దృష్టికి తెచ్చి పరిష్కారమయ్యేందుకు ప్రయత్నించాలని మంత్రి శ్రీధర్ బాబు బీఆర్ఎస్ నేతలకు హితవు పలికారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement with us -

తాజా వార్తలు

Social Media Auto Publish Powered By : XYZScripts.com