32.2 C
Hyderabad
Tuesday, April 21, 2026

Live Video

spot_img

మైనారిటీల భద్రత, సంక్షేమానికి భరోసా – ఏపీ సీఎం చంద్రబాబు

– ప్రపంచమంతా జరుపుకునే అతి పెద్ద పండుగ క్రిస్మస్
– సేవ, కరుణ, ప్రేమకు క్రిస్టియానిటీ ప్రతీక
– గుంటూరులో క్రిస్టియన్ భవనాన్ని త్వరలోనే పూర్తిచేస్తాం
– సెమీ క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్న సీఎం చంద్రబాబు

ప్రపంచమంతా పెద్ద ఎత్తున జరుపుకునే ఏకైక పండుగ క్రిస్మస్ అని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. లోక రక్షకుడైన ప్రభువు కరుణ మనందరిపై ఉండాలని ఆకాంక్షించారు. విజయవాడలోని ఏ ప్లస్ కన్వెన్షన్ హాలులో జరిగిన సెమీ క్రిస్మస్ వేడుకలకు సీఎం చంద్రబాబు సోమవారం హాజరయ్యారు. ఈ సందర్భంగా పాస్టర్లు ప్రత్యేక ప్రార్థనలు చేశారు. కేక్ కట్ చేసి పాస్టర్లకు ముఖ్యమంత్రి తినిపించారు. అనంతరం వేడుకలకు వచ్చిన వారిని ఉద్దేశించి సీఎం చంద్రబాబు మాట్లాడారు.

ప్రేమ, కరుణ, సేవకు ప్రతీక క్రిస్టియానిటి. స్వాతంత్ర్యం రాకముందు నుంచి ఏసుప్రభువు స్ఫూర్తితో విద్యాసంస్థలు ఏర్పాటు చేసి క్రిస్టియన్స్ మంచి చదువులు అందించారు. ఆసుపత్రుల్లో మెరుగైన సేవలందించారు. పశువుల పాకలో పుట్టి, గొర్రెల కాపరిగా పెరిగి నిరాడంబరతను ప్రభువు చాటుకున్నారు. నమ్మినవారి కోసం బలిదానానికి కూడా వెనుకాడని క్రీస్తు గొప్పతనాన్ని ప్రతిఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలి. ఎల్లప్పుడూ ప్రభువు త్యాగాన్ని స్మరించుకుని శాంతి మార్గాన్ని అనుసరించి ప్రేమ తత్వాన్ని పెంచుకోవాలని ముఖ్యమంత్రి అన్నారు.

సమైక్య రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో సెమీ క్రిస్మస్, క్రిస్మస్ వేడుకలు జిల్లాల్లో కూడా చేయాలని ఆదేశాలు ఇచ్చాం. మైనారిటీ వర్గాల సంక్షేమానికి, భధ్రతతకు ఎప్పుడూ అండగా ఉంటాము. సమైఖ్య రాష్ట్రంలో చర్చిపై దాడి జరిగితే నేను స్వయంగా వెళ్లి విచారణ చేశాను. అలాంటి ఘటనలు పునరావృతం కాకుండా నియంత్రించాము. రాష్ట్ర విభజన తర్వాత కూడా క్రిస్టియన్ సంక్షేమానికి ప్రాధాన్యం ఇచ్చామని, చర్చిల నిర్మాణానికి ఆర్థిక సాయాన్ని ప్రభుత్వం తరపున అందించామని అన్నారు. సేవా కార్యక్రమాలు చేసే ఒక్కో సంస్థకు రూ.10 లక్షల చొప్పున ఆర్థిక సాయం చేశాం. గుంటూరులో క్రిస్టియన్ భవనానికి 2 ఎకరాలు కేటాయించి రూ.10 కోట్ల నిధులు కేటాయించాం. కానీ తర్వాత వచ్చిన ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా నిర్మాణం నిలిచిపోయింది. త్వరలోనే ఈ భవనాన్ని పూర్తి చేసి క్రిస్టియన్‌లకు అంకితం చేస్తాం. విజయవాడలోని సీఎస్ఐ సెయింట్ బాసిలికా చర్చికి రూ.1.5 కోట్లు ఇచ్చాం. క్రైస్తవ స్మశానవాటికల కోసం నిధులు మంజూరు చేశాం. ఇదే విధంగా రాబోయే రోజుల్లో కూడా అండగా నిలుస్తాం. జెరూసలెం వెళ్లే వారికి మొట్టమొదటిసారి ఆర్థిక సాయం అందించే విధానానికి శ్రీకారం చుట్టాం. క్రైస్తవ విద్యార్థుల సంక్షేమం కోసం ప్రీ మెట్రిక్, పోస్ట్ మెట్రిక్ స్కాలర్ షిప్ లు అందించడంతో పాటు ట్యూషన్ ఫీజులు రీయింబర్స్ చేశాం. కానీ క్రిస్టియన్ సంస్థలు ప్రారంభించిన ఎయిడెడ్ విద్యా సంస్థలను గత ప్రభుత్వం నిర్వీర్యం చేసింది. ఎన్టీఆర్ కూడా గుంటూరు ఏసీ కాలేజీలోనే చదువుకున్నారు. పేదల పట్ల, ధర్మాన్ని నమ్మిన వారి పట్ల దేవుడు ఎల్లప్పుడూ ఉంటారు. అని చంద్రబాబు పేర్కొన్నారు.

రాష్ట్రంలో తీవ్రమైన ఆర్థిక సమస్యలు ఉన్నాయని,వారసత్వ అప్పులు వెంటాడుతున్నాయని అన్నారు. గతంలో మూడు సార్లు సీఎంగా చేసినా ఇంత కష్టమనిపించ లేదు గానీ, తవ్విన కొద్దీ గత ప్రభుత్వం చేసిన తప్పులు, అప్పులు బయటపడుతున్నాయన్నారు. అయినా పట్టుదలతో పోరాడుతున్నామని, మీరు నాకు ఇచ్చిన బాధ్యతను నెరవేర్చుతానని హామీ ఇచ్చారు. క్రిస్టియన్ మిషనరీస్ ప్రోపర్టీస్ డెవలెప్మెంట్ బోర్డు ఏర్పాటు చేస్తామన్నారు. చర్చిల నిర్మాణానికి, పునరుద్ధరణకు ఆర్థిక సాయం అందిస్తామని, తాను ఎప్పుడూ పేదల పక్షపాతిగానే ఉంటానని చెప్పారు. పేదరికం లేని సమాజం కోసం ఆలోచిస్తున్నానన్న చంద్రబాబు.. స్వర్ణాంధ్ర విజన్ 2047లో మొదటి అంశం పేదరిక నిర్మూలన గురించి పొందుపరిచామన్నారు. ఆర్థిక అసమానతలు తగ్గించేందుకు కలిసి పనిచేద్దామని సీఎం చంద్రబాబు పిలుపునిచ్చారు.

Bhaskara News
Bhaskara Newshttps://bhaskaranews.com/
నేమాని మీడియా హౌస్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మీడియా విభాగాల్లో భాస్కర న్యూస్ (bhaskaranews.com)

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement with us -

తాజా వార్తలు

Social Media Auto Publish Powered By : XYZScripts.com