తెలంగాణ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ కీలక నిర్ణయం తీసుకుంది. సంధ్యా థియేటర్ తొక్కిసలాటలో ప్రాణాపాయ పరిస్థితుల్లో వెంటిలేటర్పై చికిత్స పొందుతున్న చిన్నారి శ్రీ తేజ్ కు ఆర్థిక భరోసానిచ్చేందుకుసిద్ధమైంది. శ్రీ తేజ్ కోసం విరాళాలు సేకరించాలని నిర్ణయించింది. టీఎఫ్ సిసి సభ్యులంతా చిన్నారి కోసం విరాళాలు సేకరించడానికి రంగంలోకి దిగారు. అయితే చిన్నారికి సాయం చేయడానికి అల్లు అర్జున్ టీమ్ కూడా ముందుకొచ్చింది. విరాళాల సేకరణ పూర్తయ్యాక వచ్చిన మొత్తాన్ని లెక్కించి ఆ చిన్నారి ఆరోగ్యం కోసం ఖర్చు చేస్తారు. మరోవైపు ఇప్పటికే ప్రభుత్వం ఆ చిన్నారి వైద్య ఖర్చులు భరించేందుకు ముందుకొచ్చింది. మంత్రి కోమటి రెడ్డి ప్రతీక్ ఫౌండేషన్ తరపున పాతిక లక్షలు విరాళంగా అంద చేశారు.
ఘటన జరిగిన మరుసటి రోజే అల్లు అర్జున్ భారీ విరాళం ప్రకటించి ఉంటే విషయం ఇంత దూరం వచ్చేది కాదంటున్నారు కొందరు. పరామర్శకు రావడంపై లీగల్ టీమ్ సూచనలు పాటించానని చెబుతున్నా.. ఓ భారీ అమౌంట్ గనక ప్రకటించి ఉంటే వివాదం ఇంత దూరం వచ్చేది కాదన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఇప్పుడు ఎంత చేసినా.. అది లెక్కలోకి రాదని, అర్జున్ పై తెలంగాణ సీఎం చేసిన పరోక్ష వ్యాఖ్యలతో ఆయన వ్యక్తిత్వంపై విశ్లేషణలు ఎక్కువవుతున్నాయి.
మరోవైపు.. సీఎం రేవంత్రెడ్డి నిర్ణయాన్ని తెలంగాణ ఫిల్మ్ ఎగ్జిబిటర్స్ అసోసియేషన్ స్వాగతించింది. టికెట్ ధరలు, బెనిఫిట్ షోల విషయంలో సీఎం నిర్ణయాన్ని స్వాగతిస్తామని విజయేందర్ రెడ్డి ప్రకటించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి,మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. థియేటర్లలో ఏ సినిమా అయినా నిర్ణీత మొత్తంలోనే టికెట్ ధరలు ఉండాలని విజయేందర్ రెడ్డి ఆకాంక్షించారు. అలాగే, తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఎగ్జిబిటర్స్ అసోసియేషన్స్ అధ్యక్షుడు డీఎస్ రాంప్రసాద్ కూడా ఈ నిర్ణయానికి మద్దతు ప్రకటించారు. భారీ బడ్జెట్ పెట్టామని నిర్మాతలు టికెట్ ధరలు పెంచడం వల్ల ప్రేక్షకులు ఇబ్బందిపడుతున్నారని, తెలంగాణలో తీసుకున్న నిర్ణయాన్ని ఏపీ ప్రభుత్వం కూడా తీసుకోవాలని ఏపీ ఎగ్జిబిటర్లు విజ్ఞప్తి చేశారు. తెలుగు ఫిలిం చాంబర్లో జరిగిన సమావేశంలో పలువురు నిర్మాతలు, ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్లు పాల్గొన్నారు.