- అదే జరిగితే జగన్ కే థాంక్స్ చెప్పాలి..
- టాలీవుడ్ పెద్దల చూపు ఏపీ వైపు
- బాబు, పవన్ లను కలిసేందుకు అపాయింట్ మెంట్
పుష్ప 2 మూవీ విడుదల సందర్భంగా తొక్కిసలాట టాలీవుడ్ వర్గాలను ఆలోచనలో పడేసింది. ఇప్పటి వరకూ సినిమాల హబ్ గా వెలుగొందిన హైదరాబాద్ స్థానం ఇకపై నుంచి విశాఖకు మారనుందా? అల్లు అర్జున్ ఘటన నేపధ్యంలో ఇప్పటికే ఏపీ పెద్దలను కలవాలని టాలీవుడ్ లో కీలక పెద్దలు నిర్ణయించినట్లు తెలుస్తోంది. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ల అపాయింట్ మెంట్ కోరినట్లు.. బుధ, లేదా గురు వారాల్లో అపాయింట్ మెంట్ ఫిక్స్ అవుతుందనే వార్తలొస్తున్నాయి.అల్లు అరవింద్ సహా కీలక టాలీవుడ్ పెద్దలతో పాటు తమిళ నాడు నుంచి సుహాసిని లాంటి నటీమణులు కూడా ఏపీ ప్రభుత్వాన్ని కలిసే టీమ్ లో ఉండనున్నారు. ఈ మధ్య కాలంలో పవన్ కల్యాణ్ కూడా సినీ షూటింగులు ఏపీలో జరగాలని, ఇండస్ట్రీ ఇక్కడకి రావాలని పిలుపునిచ్చారు. కాబట్టి ఇండస్ట్రీ తరలి వెళ్లేందుకు సిద్ధపడితే మాత్రం ఆక్రెడిట్ జగన్ కే ముందు దక్కుతుంది. వాస్తవానికి గతంలోనే ఏపీకి రమ్మని జగన్ ప్రభుత్వం సినీ వర్గాలకు పిలుపు ఇచ్చింది. అయితే అప్పట్లో టాలీవుడ్ పెద్దలెవరూ స్పందించలేదు.
పవన్ పిలుపు..
అప్పట్లో ఈ ప్రతిపాదనను కనీసం పరిశీలించని పవన్ కల్యాణ్ ఇప్పుడు మాత్రం ఏపీకి ఇండస్ట్రీ తరలి రావాలని మాట్లాడుతున్నారు. విశాఖ లాంటి ప్రదేశాల్లో షూటింగ్ జరిగితే స్థానిక కళాకారులకు అవకాశం ఉంటుందని, ఇండస్ట్రీలో అట్టడుగు వర్గాలు బతుకుతాయని పవన్ అన్నారు.
అల్లూ అర్జున్ పై సీఎం రేవంత్ అసెంబ్లీలో మాటల దాడి చేయడం, తనను తప్పుగా చిత్రీకరిస్తున్నారని అల్లూ అర్జున్ బాధను వ్యక్తం చేయడంతో రెండు రోజులుగా టాలీవుడ్ లో సంచలన పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. బెనిఫిట్ షోలు ఉండవని, రేట్లు పెంచబోమని రేవంత్ తేల్చేయడంతో బిగ్ బడ్జెట్ మూవీస్ టిక్కెట్ రేట్లు పెంచాలని ఏపీ పెద్దలను ప్రాధేయపడుతున్నారా లేక ఏపీకి ఇండస్ట్రీ తరలి వెళ్లే ఆలోచన చేస్తున్నారా అన్నది ఇంకా క్లారిటీ రావాలి. డివిజన్ తర్వాత ఏపీ వైపు ఇండస్ట్రీ తరలి వెళ్లాలని కొందరు ఏపీ ప్రజలు కూడా అనుకున్నా.. ఇక్కడ స్థిరపడిపోయిన ఇండస్ట్రీ ఇక్కడి వాతావరణానికి, పరిస్థితులకు అలవాటు పడిపోయింది. ఉమ్మడి రాష్ట్రం టైములో మద్రాస్ లో స్థిరపడిన ఇండస్ట్రీని హైదరాబాద్ రాజధాని కారణంగా ఇక్కడకు తరలించేందుకు అప్పటి ప్రభుత్వాలు ప్రయత్నించాయి. ఇండస్ట్రీ ఎదగడానికి ఎన్నోరాయితీలు, సబ్సిడీలు, ప్రోత్సాహకాలు కల్పించాయి. అన్నపూర్ణ,రామానాయుడు లాంటి స్టూడియోలు అప్పుడు ఏర్పడినవే.
మార్కెటింగ్, పంపిణీ, హైటెక్ సిటీ బజ్…
పైగా సినిమాల మార్కెటింగ్, వ్యయం విషయంలో ప్రపంచవ్యాప్తంగా ఒక ఎత్తు అయితే.. ఇక్కడి వాతావరణం కూడా ఇండస్ట్రీ ఎదగడానికి దోహదపడింది. డిస్ట్రిబ్యూషన్ వ్యవస్థలో కేవలం నైజాం పంపిణీ వ్యవస్థ ఒక్కటీ ఒక ఎత్తు. ఆదాయంలో నైజాం పంపిణీ మార్కెట్ కు ఏవరూ పోటీ రాలేరు. ఇక్కడి మార్కెట్, భారీ కలెక్షన్లు, డిస్ట్రిబ్యూషన్ నెట్ వర్క్, వాతావరణం, పెద్ద ఎత్తున ఉన్న థియేటర్లు అన్నీ అనుకూలాంశాలు. పైగా అన్ని రకాల అభిమానులు ఉన్న హైదరాబాద్ ను వదులుకుని వెళ్లాలంటే సేఫ్ హెవెన్ ను వదులుకుని వెళ్లడమేననే భావన ఉంది. మల్టి ప్లెక్స్ థియేటర్ల కల్చర్ పెరగడం, హీరోలే ఈ బిజినెస్ లోకి దిగడంతో మూవీ నిర్మాణాలు, పంపిణీ, ప్రమోషన్, కలెక్షన్స్అన్నీ ఇక్కడ కీలకమే. పైగా ఇటీవల సృష్టించిన పెను సంచలనాలతో టాలీవుడ్ ముందు బాలీవుడ్ కూడా మోకరిల్లాల్సిన పరిస్థితి. రాజమౌళి సినిమాలు నార్త్ లో ఓ ట్రెండ్ సృష్టించాయి. అల్లూ అర్జున్ పుష్ప వన్ సృష్టించిన కలెక్షన్ల సునామీ అంతా ఇంతాకాదు. రీసెంట్ గా పుష్ప 2 కూడా అంతే.. అల్లు అర్జున్ నేషనల్ అవార్డు దక్కించుకుని ఓ రేంజ్ లో తెలుగు వారి ఖ్యాతిని నిలబెట్టాడనే ఫీలింగ్ ప్రత్యేకించి ఏపీ వారికి ఉంది. ఇవన్నింటితో పోలిస్తే.. ఏమీ లేని అక్కడకు వెళ్లి నిలదొక్కు కోడం కొంచెం టైమ్ పట్టే ప్రక్రియ.
తెలంగాణ ఆదాయంలో కీలకం..
మరోవైపు ఇండస్ట్రీ ఇక్కడే ఉన్నందుకు.. వాస్తవానికి బడా హీరోల సినిమాల వల్ల ప్రభుత్వానికీ ఆదాయమార్గమే. జీఎస్టీ, టాక్స్ రూపంలో భారీ ఆదాయం ప్రభుత్వానికి వస్తుంటుంది. ఈ రకమైన మినిమం బెనిఫిట్ కల్చర్ కు అలవాటు పడిన ఇండస్ట్రీకి ఇప్పుడు అక్కడ కొత్తగా స్టేజ్ సెట్ చేసుకోవడం అంటే కొంచెం కష్టమే.
తెలంగాణ సినిమా బతుకుతుంది..
సీనీ పెద్దల ఆలోచనలెలా ఉన్నా..తెలంగాణ వారు కొందరు మాత్రం సంతోషిస్తున్నారు. విభజన ఉద్యమానికి కారణం ఇది కూడా ఒకటని వారంటున్నారు. ఏపీ బడా నేతలు, పెద్దలు, బిజినెస్ మెన్, కొన్నిఆధిపత్య సామాజిక వర్గాల ధోరణుల వల్ల ఏకపక్ష పోకడలు, నియంత్రుత్వ, ఆధిపత్య పోకడలు ఎక్కువయ్యాయనే వాదనలున్నాయి. స్థానిక, చిన్న కళాకారులు మరింత అభద్రతలోకి వెళ్లిపోతున్నారని తెలంగాణ కళాకారుల నుంచి ఆవేదన ఉంది. ఇండస్ట్రీ ఏపీకి తరలివెడితే తెలంగాణ చిత్రపరిశ్రమ లోకల్ టాలెంట్ తో రాణిస్తుందని వారంటున్నారు. సినిమాను సినిమాలాగా చూడాలని ఈ బేధాలు వద్దని కోరుకునే సినీ ప్రియులు మాత్రం రెండు తెలుగు రాష్ట్రాలలోనూ ఇండస్ట్రీ ఎదగాలని, నమ్మకమైన రాష్ట్ర ఆదాయమార్గంగా నిలబడాలని కోరుకుంటున్నారు.