బాధితులుగా మిగిలిన సామాన్య ప్రజలకు న్యాయం జరగాలంటే వేగంగా న్యాయం జరిపించడమొక్కటే మార్గమని హోంమంత్రి వంగలపూడి అనిత వెల్లడించారు. పోలీసులు, జైళ్లు, న్యాయవ్యవస్థలు సమర్థంగా పనిచేసేందుకు కావలసిన ఏర్పాట్లకు కూటమి ప్రభుత్వం ప్రాధాన్యతనిస్తుందని ఆమె స్పష్టం చేశారు. తద్వారా పెండింగ్ కేసుల పరిష్కారంపై ప్రత్యేకంగా దృష్టిసారిస్తామన్నారు. రాష్ట్ర సచివాలయంలోని కాన్ఫరెన్స్ హాల్ లో హోంమంత్రి వంగలపూడి అనిత.. న్యాయ శాఖ మంత్రి ఎన్ఎండీ ఫరూక్ తో కలిసి ఫాస్ట్ ట్రాక్, స్పెషల్ కోర్టులలో ఉన్న కేసులు, పనితీరు, పురోగతిపై సమీక్షా సమావేశం నిర్వహించారు. స్పెషల్ కోర్టులు, ఫాస్ట్ ట్రాక్ కోర్టులు, ఏసీబీ కోర్టులు, పోస్కో, మహిళలకు సత్వర న్యాయమందించే న్యాయ వ్యవస్థలను మరింత పటిష్టం చేస్తామన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకెళ్లి పోలీసు, జైళ్లు, న్యాయ వ్యవస్థల్లోని ఖాళీలను భర్తీ చేసే దిశగా చర్యలు తీసుకుంటామన్నారు. గత ప్రభుత్వంలో కక్షలు, ఆక్రమణలు, ప్రశ్నిస్తే కేసులు పెట్టి వేధించిన అరాచకాల బారిన పడి న్యాయం కోసం ఎదురుచూస్తున్న వారందరికీ కూటమి ప్రభుత్వం భరోసా కలిగిస్తుందని హోంమంత్రి స్పష్టం చేశారు. కూటమి ప్రభుత్వంలో న్యాయం పొందే హక్కు అందరికీ సమానంగా ఉంటుందన్నారు. ఆ హక్కును వినియోగించుకునే సౌలభ్యాన్ని అందించేందుకు సిద్ధంగా ఉన్నట్లు పేర్కొన్నారు. బాధితులకు తక్కువ వ్యయంతో సమర్థంగా, సులువుగా, వేగంగా న్యాయం అందించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని హోంమంత్రి తెలిపారు.
అల్పపీడనం నేపథ్యంలో హోంమంత్రి వంగలపూడి అనిత విపత్తు నిర్వహణ సంస్థ ఎండీ కూర్మనాథ్ తో సమీక్ష నిర్వహించారు. శనివారం ఉత్తరాంధ్రలో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో ఆయా జిల్లాల అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేశారు. కోస్త్రాంధ్రలో చాలా చోట్ల మోస్తరు నుంచి విస్తారంగా వర్షాలు కురిశాయన్నారు. రాయలసీమలో కూడా ఉరుములతో కూడిన జల్లులు పడే అవకాశం ఉండడంతో విపత్తు నిర్వహణ సంస్థ ఎప్పటికప్పుడు హెచ్చరిక సందేశాలు పంపి ప్రజలను అప్రమత్తం చేయాలని హోంమంత్రి ఆదేశించారు.