రాజ్య సభ ఛైర్మన్ కు బీజేపి మహిళా ఎంపీ లేఖ
అంబేద్కర్ పై వ్యాఖ్యల దుమారం పై బీజేపి , కాంగ్రెస్ పోటా పోటీ నిరసనల నేపధ్యంలో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ టార్గెట్ అయ్యారు. పార్లమెంటు మకర ద్వారం దగ్గర బీజేపి ఎంపీ సారంగిని కాంగ్రెస్ నేత రాహుల్ నెట్టేశారని, కింద పడేశారని ఆరోపణలకు తోడు ఇప్పుడు మరో ఆరోపణ రేగింది. రాహుల్ తన పట్ల అసభ్యంగా ప్రవర్తించారంటూ రాజ్యసభలో బీజేపి ఎంపీ ఫంగన్ కొన్యాక్ స్పీకర్ కు లేఖ రాశారు. ఎంపీల నిరసన కార్యక్రమంలో బీజేపీ ఎంపీలను కాంగ్రెస్ ఎంపీలు నెట్టేశారని, ఈక్రమంలోనే తన పక్కనే ఉన్న రాహుల్ తో తాను చాలా ఇబ్బందులు పడినట్లు ఆ మహిళా ఎంపీ రాజ్య సభ ఛైర్మన్ కు లేఖ రాశారు. రాహుల్ ప్రవర్తనతో తన మర్యాద, ఆత్మగౌరవం మంట గలిశాయని ఆ లేఖలో ఆరోపించారు. రాహుల్ తనను కూడా నెట్టే ప్రయత్నంచేశారని, ఒక మహిళా ఎంపీగా నిరసన తెలిపే తన హక్కును సైతం కాదనుకుని తాను వెనక్కు తగ్గాల్సి వచ్చిందని కొన్యాక్ లేఖలో వివరించారు.
సారంగీని నెట్టేశారు
ఇదే ఘర్షణలో బీజేపి ఎంపీ ప్రతాప్ సింగ్ సారంగీని రాహుల్ నెట్టేశారని ఆయన కింద పడి తలకు గాయమైందని బీజేపి ఇప్పటికే ఆరోపించింది. సారంగీ ఆస్పత్రి ఐసీయులో చేరి చికిత్స పొందుతున్నారు. ఈ వివాదం ఇంకా చల్లారకముందే ఇప్పుడు మహిళా ఎంపీ లేఖ రాయడం సంచలనంగా మారింది.