బెంగుళూరు టెకీ సూసైడ్ కేసులో ట్విస్ట్
ఆత్మ హత్య చేసుకున్న బెంగళూరు టెకీ అతుల్ సుభాష్ భార్య నికితా సంఘానియా పోలీసులకు చిక్కడం వెనక ఉత్కంఠ భరితమైన స్టోరీ ఉంది. బెంగళూరులో అతుల్ భార్య, అత్త, మామలపై పోలీసులు కేసు పెట్టిన నాటి నుంచి యూపీ ప్రయాగ రాజ్ లో ఉన్న వీరి కుటుంబం అజ్నాతం లోకి వెళ్లి పోయింది.వారు ఉంటున్న ఇంటికి తాళం పెట్టి నలుగురూ నాలుగు దిక్కులకూ పారిపోయారు. నిఖితా గురుగ్రామ్ లోని పీజీ అకామడేషన్ సెంటర్ కు పారిపోగా, తల్లి, సోదరుడు ఇతరులు అదే ప్రయాగ రాజ్ జిల్లాలోని మారు మూల ప్రాంతమైన ఝూసీకి పారిపోయారు. నలుగురూ నాలుగు చోట్ల ఉంటూ కథ నడిపారు. ఒకరితో ఒకరు రెగ్యులర్గా ఫోన్ టచ్లో ఉన్నారు. సాధారణ కాల్స్ అయితే పోలీసులు ట్రేస్ చేస్తారని వాట్సప్ కాల్స్ లోనే మాట్లాడుకోవడం మొదలు పెట్టారు. దాంతో వీరెక్కడున్నారో పోలీసులకు తెలియ లేదు. వారిని అరెస్టు చేసేందుకు బెంగళూరు పోలీసుల టీమ్ ప్రయాగ రాజ్ లోని వారింటికి చేరుకుంది. ఇల్లు తాళం పెట్టి ఉండటంతో మూడు రోజుల్లోగా లొంగిపోవాలంటూ నోటీసులు గేటుకు అంటించి వచ్చేశారు. కొన్నాళ్లు ఈ కుటుంబం బానే తప్పించుకున్నా.. అతుల్ భార్య నిఖిత చేసిన ఒక పొరపాటు అందరూ పట్టుబడేలా చేసింది. నిఖిత తన బంధువులకు చేసిన సాధారణ కాల్ ని పోలీసులు ట్రేస్ చేశారు. టవర్ లొకేషన్ ఆధారంగా ఆమె గురుగ్రామ్ పీజీ అకామడేషన్ సెంటర్ లో ఉందని గుర్తించి అక్కడకు చేరుకుని ఆమెను అదుపులోకి తీసుకున్నారు. ఆమెతోనే తల్లికి సాధారణకాల్ చేయించారు. దాంతో ఆమె ఎక్కడున్నది వారికి తెలిసిపోయింది. మొత్తానికి అందరినీ ట్రేస్ చేసి బెంగళూరు తరలించారు. ఈ గొడవలోకి అతుల్ కుమారుడిని లాగే ఉద్దేశం లేకపోవడంతో వారి బంధువుల దగ్గరే వదిలిపెట్టారు.
నిందితుల తరలింపు కూడా సవాల్
అతుల్ ఆత్మహత్య బెంగళూరులో స్థానికులను కలచివేసింది. నిందితులు ఎక్కడున్నా దొరకబుచ్చుకుని చితక్కొట్టాలన్న కసితో వారు ఉన్నారు. ఈవిషయం తెలుసుకున్న పోలీసులు అర్ధరాత్రి దాటిన తర్వాత నిందిత కుటుంబం ముఖాలకి ముసుగులు తొడిగి లేట్ నైట్ ఫ్లైట్ లో బెంగళూరుకు కట్టుదిట్టమైన భధ్రతా ఏర్పాట్ల మధ్య తరలించారు. ఆగ మేఘాల మీద మేజిస్ట్రేట్ ముందు ప్రవేశపెట్టి ఆపై వైద్యపరీక్షలు పూర్తి చేయించి తెల్ల వారకుండానే వారిని జైల్లోకి తోసారు.
డబ్బు డిమాండ్ చేయలేదు..
ఇంటరాగేషన్ లో నిఖిత తాను డబ్బుడిమాండ్ చేయలేదని అదే నిజమైతే అతుల్ ని వదిలి ఎందుకు వెళిపోతాననీ ఎదురు తిరిగింది. నిజానికి అతులే తనను వేధించాడని ఉల్టా కంప్లయింట్ చేసింది. విడాకులిచ్చేందుకు మూడు కోట్ల భరణం చెల్లించాలని వేధిస్తున్నారని వివాదాస్పద 498 ఏ ను తనపై ప్రయోగించి వేధింపులకు పాల్పడుతున్నారంటూ అతుల్ సుభాష్ ఇటీవల ఆత్మహత్య చేసుకున్నసంగతి తెలిసిందే. అయితే ఆత్మహత్యకు 15 రోజుల ముందే సుభాష్ సూసైడ్ ఎలా చేసుకోవాలో యూట్యూబ్ లో, గూగుల్ లో సెర్చ్ చేసినట్లు సమాచారం. అలాగే ఆఫీస్ ఫైళ్లు, లాప్ టాప్, ఇతర పరికరాలు రిటర్న్ చేసి, సన్నిహితులు, చివరకు పాలవాడి బాకీ సైతం అణాపైసలతో అతుల్ తీర్చేయడం ఈ ఘటన గురించి విన్న వారి మనసును వికలం చేసింది.