మమతా బెనర్జీ మనసులో మాట..
ఇండియా కూటమిలో కీచులాటలు కొనసాగుతున్నాయి. అవకాశమిస్తే ఇండియా కూటమికి నేత్రుత్వం వహించడానికి తాను రెడీ అని తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ ప్రకటించారు. బెంగాల్ సీఎం బాధ్యతలు నిర్వహిస్తూనే ఇండియా కూటమి పగ్గాలు చేపట్టడానికి తనకెలాంటి ఇబ్బంది, అభ్యంతరం లేదని మమతా ప్రకటించారు. మమతా బెనర్జీ ఇంత బాహాటంగా ఈ అంశం ప్రకటించడం ఇదే తొలిసారి. ఒకప్రధాన ప్రతిపక్ష నేతగా తాను ఇండియా కూటమిని స్థాపించానని ఎవరూ దాని బాధ్యతలు సరిగా నిర్వర్తించకపోతే తానేం చేయగలనని ప్రశ్నించారు. అవసరమైతే దాని సారధ్య బాధ్యతలు తీసుకోడానికి తనకెలాంటి అభ్యంతరం లేదన్నారు. ఓ న్యూస్ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె ఈ కామెంట్ చేశారు.అయితే తాను అస్తమాను ఈ బాధ్యతల కోసం ఢిల్లీ రానని, బెంగాల్ నుంచే నిర్వర్తిస్తానని అన్నారు. బీజేపి వ్యతిరేక కూటమిగా ఏర్పాటైన ఇండియా బ్లాక్ లో దాదాపు 12 పార్టీలున్నాయి. అయితే ఈ కూటమి ఆరంభమైననాటినుంచి అలకలు, కీచులాటలు కామన్ అయిపోయాయి. త్రుణమూల్ ఎంపీ కల్యాణ్ బెనర్జీ కొన్ని రోజుల క్రితం ఇండియా కూటమిలో పార్టీల నేతలంతా ఈగోలు పక్కన పెట్టి ముందుకు రావాలని, మమతాను న్యూట్రల్ నేతగా గుర్తించాలని కోరారు. ఇండియా కూటమిలో అతిపెద్ద భాగస్వామ్యం కలిగిన పార్టీ కాంగ్రెస్ అయినప్పటికీ త్రుణమూల్ అధినేత్రి తాను కూటమి సారధ్యానికి బెటర్ ఛాయిస్ అని భావిస్తున్నారు. చాలాకాలంనుంచి పరోక్షంగా ఈ సంకేతాలనిస్తున్నారు.