అంబేద్కర్ అన్ని వర్గాల అభ్యున్నతికి కృషి చేశారని డిప్యూటీ సీయం భట్టి విక్రమార్క అన్నారు. శుక్రవారం డాక్టర్ బీఆర్ అంబేదర్కర్ వర్ధంతి సందర్భంగా జేఎన్టీయూలో ఏర్పాటు చేసిన సభలో డిప్యూటీ సీయం ప్రసంగించారు. అంతకు ముందు యూనివర్శిటీ ఆవరణలో ఉన్న అంబేద్కర్ విగ్రహానికి పూల మాల ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా భట్టి మాట్లాడుతూ జీవితంలో అనేక అవమానకర సంఘటనలను అంబేద్కర్ పాజిటివ్ గా తీసుకున్నారని అన్నారు. దేశంలో ఉన్న అన్ని సమస్యల పరిష్కారానికి రాజ్యాంగం ఒక్కటే దిక్కని భట్టి చెప్పారు. మన దేశంలో అద్భుతమైన మానవ వనరులు ఉన్నాయని కానీ అవి జాతుల పోరాటంలో వృధా అవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. విద్య ద్వారా మాత్రమే సమస్యల పరిష్కారానికి మార్గం ఏర్పడుతుందని భావించే రాష్ట్ర ప్రభుత్వం పెద్దయెత్తున విద్యారంగంపై ఖర్చు చేస్తోందని తెలిపారు. సమగ్ర కుటుంబ సర్వే 99 శాతం పూర్తయ్యిందని త్వరలో వివరాలను ప్రజల ముందు పెడతామన్నారు. ఆదునిక భారత దేశం కోసం ప్రతి ఒక్కరూ శ్రమించడమే అంబేద్కర్ కు మనం ఇచ్చే ఘన నివాళి అన్నారు.