షిండే అలా..ఫడ్నవిస్ ఇలా…
మహారాష్ట్ర డెడ్ లాక్ ఎలా వీడిందంటే…
ఎట్టకేలకు మహారాష్ట్రలో కొత్త ప్రభుత్వం కొలువుదీరింది. దాదాపు పది రోజుల సస్పెన్స్ కి ఇవాల్టి ప్రమాణస్వీకారంతో తెర పడింది. అయితే ఇది అంత సులభంగా జరగలేదు. ముఖ్యమంత్రి పీఠంపై కన్నేసిన ఏక్ నాథ్ షిండే బీజేపి పెద్దలు ఎలా చెబితే అలాగే ..అదే మాట ఫైనల్ అని పైకి అంటూనే తెర వెనుక బేరసారాలు మొదలు పెట్టారు. సీఎం పదవి ధ్యేయం కాదంటూనే దానికోసం ఇండైరక్ట్ గా చేయని ప్రయత్నం లేదు. బీజేపీ పెద్దలు ఫడ్నవిస్ తమ అభ్యర్ధి అని ప్రకటించగానే షిండే డీలా పడ్డారు.. హోం శాఖ, డిప్యూటీ సీఎం పదవులతో పాటు మరిన్ని కీలక శాఖల కోసం పట్టుబట్టారు. అంతా సద్దుమణుగుతుందనుకున్న టైమ్ లో ముఖం చూపించకుండా మాయమయ్యారు. గవర్నర్ ను కలిసి ప్రభుత్వ ఏర్పాటు పత్రం ఇద్దాం రమ్మన్నా ముఖం చాటేశారు. మహాయుతి కూటమి సంయుక్తంగా పెట్టిన విలేకరుల సమావేశంలోనూ పక్కనున్న అజిత్ పవార్ కు ఝలక్ ఇచ్చారు. నేను పదే పదే మాట మార్చే వాడిని కాదని అంటూనే కూటమి తరపున ప్రభుత్వ ఏర్పాటుకు అంగీకార ప్రకటన చేయమంటే చేయలేదు. మూడురోజుల క్రితం హోం టౌన్ సతారాకు వెళ్లి అక్కడ అనారోగ్యం పాలయి ఆస్పత్రిలో చేరారు. ఆ తర్వాత కోలుకున్నా.. చర్చలకు అందుబాటులోకి రాలేదు. చివరకు శివసేన షిండే వర్గం ఎమ్మెల్యేలు ప్రభుత్వ ఏర్పాటులో పాల్గొనమని, డిప్యూటీ సీఎం పదవి తీసుకోమని పట్టుబట్టి, బలవంతంగా డిమాండ్ చేస్తే అప్పుడు ఒప్పుకున్నారు.5.30 కి ప్రభుత్వ ప్రమాణ స్వీకారం కాగా అంతకు రెండు గంటల ముందు వరకూ షిండే బీజేపి పెద్దలను అయోమయంలోనే ఉంచారు. షిండే ఇంత బెట్టు చేయడానికి కారణం గత ప్రభుత్వంలో సీఎంగా చక్రం తిప్పిన తాను ఇప్పుడు డిప్యూటీ సీఎంగా ఫడ్నవిస్ మాట విని తగ్గి ఉండాల్సి వస్తుందన్న కారణంతోనే.
ఎక్కడ నెగ్గాలో కాదు..ఎక్కడ తగ్గాలో తెలుసు..
దేవేంద్ర ఫడ్నవిస్ దీనికి పూర్తిగా భిన్నం.అంది వచ్చిన అవకాశాన్ని పుచ్చుకుని నమ్మకమైన నేతగా ఎదగడం ఆయన పంథా.. మిత్ర పక్షాలతో కూడా సత్సంబంధాలు నెలకొల్పుకోడం, అవసరానుగుణంగా వ్యూహాలు రచించుకోవడం ఆయన సొంతం.. అంతకుముందు మహారాష్ట్ర సీఎంగా రెండు సార్లు ఆయన అజేయంగా పరిపాలించినా కాలం కలసి రానప్పుడు అణుకువగా ఉండాలన్న తత్వం తెలిసిన వ్యక్తి.అందుకే ఏక్ నాథ్ షిండే ప్రభుత్వంలో డిప్యూటీ సీఏం గా పనిచేయాల్సి వచ్చినా అది చిన్నతనంగా భావించలేదు. పైగా పరిశ్రమల మంత్రిగా తనదైన ముద్ర రాష్ట్రం పై వేయగలిగారు.. అందుకే దేవేంద్ర ఫడ్నవిస్ ను అందరూ మోడ్రన్ అభిమన్యుడు అని అభివర్ణిస్తారు. రాజకీయ పద్మవ్యూహంలో ఏ అడుగు ఎలా వేయాలో తెలిసిన వ్యక్తి.. ఎక్కడ నెగ్గాలో కాదు..ఎక్కడ తగ్గాలో తెలిసిన వ్యక్తి.తాను ఒకప్పుడు షిండే కేబినెట్ లో డిప్యూటీ సీఎం కాగా ఇప్పుడు తన కేబినెట్ లో షిండే డిప్యూటీ సీఎం అయ్యారు..కూటమితో ఇబ్బందులు రాకూడదనే కీలకమైన12 కేబినెట్ బెర్తులు షిండే వర్గానికి కేటాయించాలని ముందే ఫిక్సయిపోయారు.