– నాలుగో విడతకు రూ.2,747.67కోట్లు విడుదల
– మొత్తం రూ.20.68 వేల కోట్లు రుణమాఫీ
తెలంగాణలో రెండు లక్షల రూపాయల్లోపు రుణాలు తీసుకున్న రైతులకు రుణమాఫీ సంపూర్ణ మయినట్లేనంటోంది రాష్ట్ర ప్రభుత్వం. ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ మేరకు రేవంత్ సర్కారు దశల వారీగా రుణమాఫీ నిధులను విడుదల చేస్తోంది. ఇప్పటివరకు మొత్తం నాలుగు విడతల్లో ఈ పథకం కోసం నిధులు మంజూరు చేశారు. శనివారం మహబూబ్నగర్లో జరిగిన రైతుపండుగ కార్యక్రమంలో భాగంగా మొదటి మూడు విడతల్లో రుణమాఫీ కాని రూ.2లక్షల లోపు రుణాల రైతులకు వాళ్లు తీసుకున్న అప్పు మొత్తాన్ని బ్యాంకు అకౌంట్లకు ట్రాన్స్ఫర్ చేసే ప్రక్రియను ప్రారంభించారు.
ఇప్పటివరకు మూడు విడతల్లో 22.37 లక్షల మంది రైతులకు రుణాల కింద రూ.17,933 కోట్లు బ్యాంకులకు చెల్లించింది ప్రభుత్వం. శనివారం మహబూబ్నగర్ వేదికగా నాలుగో విడతలో రూ.2,747.67 కోట్లు విడుదల చేసింది. ఈ మేరకు ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి చెక్కును రైతులకు అందజేశారు. దీంతో, ఇప్పటివరకు రూ.20.68 వేల కోట్లు రుణమాఫీ కింద బ్యాంకులకు నిధులు విడుదల చేసినట్లు ప్రభుత్వం ప్రకటించింది. శనివారం పాలమూరులో ప్రకటించిన రూ.2,747 కోట్ల మొత్తాన్ని 3,13,897 మంది రైతుల ఖాతాల్లో జమ చేయనున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. తద్వారా నాలుగు విడతల్లో రాష్ట్రంలోని 25 లక్షల పైచిలుకు రైతులకు ఇప్పటివరకు రుణమాఫీ జరిగిందని చెబుతున్నారు.
ఇప్పటిదాకా రెండు లక్షల లోపు రుణాలు తీసుకున్న రైతులకే రుణమాఫీ చేశారు. ఎన్నికల ముందు కూడా తాము అదే హామీ ఇచ్చామని, ఇచ్చిన హామీ మేరకు రూ.2లక్షల లోపు రుణాలు తీసుకున్న వాళ్లందరికీ చెల్లించి మాట నిలబెట్టుకున్నామని రేవంతరెడ్డి అంటున్నారు. అయితే, రూ. 2 లక్షలకు పైగా రుణాలు పొందిన రైతులకు కూడా రూ.2 లక్షల రుణమాఫీ చేయాలని ప్రభుత్వం భావిస్తోందని గతంలో వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. అయితే రూ.2 లక్షలపైన ఉన్న రుణం మొత్తాన్ని వడ్డీతో సహా చెల్లించిన వారికి ఈ రుణమాఫీ చేయాలని వ్యవసాయ అధికారులు లెక్కలు తీశారు. శనివారం సీఎం ప్రకటించిన రూ. 2,747 కోట్ల మొత్తాన్ని రేషన్కార్డులు లేనివారు, కుటుంబ నిర్ధారణ కానివారు, ఆధార్ కార్డులో తప్పులు ఉన్నవాళ్లు, బ్యాంకు ఖాతాల్లో పొరపాట్లు, పేర్లలో తప్పులు దొర్లిన 3,13,897 మంది రైతుల రుణ ఖాతాలకు జమచేస్తారు. తరువాత రూ. 2లక్షల పైన అప్పులున్న రైతులకు జమచేయాల్సి ఉంది.