తెలంగాణలో రైతులకు సంక్రాంతి పండుగ తర్వాత రైతు భరోసా నిధులు అకౌంట్లలో జమ చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ప్రకటించారు. దీనిపై విధి విధానాలు ఖరారు చేసేందుకు కేబినెట్ సబ్ కమిటీ వేశామన్నారు. రైతుభరోసా కార్యాచరణపై అసెంబ్లీలో చర్చిస్తామన్నారు. ఎవరు అడ్డుపడినా రైతు భరోసా తప్పనిసరిగా అందిస్తామని స్పష్టం చేశారు. బీఆర్ఎస్, బీజేపీ నేతలు ప్రజలను, రైతులను తప్పుదారి పట్టిస్తున్నారన్న రేవంత్.. ఆ పార్టీల నేతల మాటలు రైతులు నమ్మొద్దని కోరారు.
ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటయ్యాక.. రూ. 16 వేల కోట్ల మిగులుతో తెలంగాణను కేసీఆర్కు అప్పగిస్తే, పదేళ్ల తర్వాత రూ.7 లక్షల కోట్ల అప్పులతో రాష్ట్రాన్ని తమకు అప్పగించారని మండిపడ్డారు రేవంత్. ఏడు లక్షల కోట్ల అప్పుల పై నెలకు రూ.6,500 కోట్ల వడ్డీ చెల్లించాల్సి వస్తోందన్నారు. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత ఇన్నేళ్ల కాలంలో ఏ ప్రభుత్వం కూడా ఇంత తక్కువ కాలంలో రుణమాఫీ చేయలేదన్న ముఖ్యమంత్రి.. 2018 నుంచి 2023 వరకు ఐదేళ్లలో తీసుకున్న రుణాలు అన్నీ ఏకకాలంలో తీర్చామన్నారు. తెలంగాణకు భారీగా అప్పులు ఉన్నప్పటికీ రైతుల కోసం ఎన్నో కార్యక్రమాలు చేపడుతున్నారు. ఇప్పటి వరకు 25లక్షల 35వేల మంది రైతులకు 21వేల కోట్ల రుణాలు మాఫీ చేశామని వెల్లడించారు. రేషన్కార్డు లేని వారికి కూడా రుణమాఫీ చేశామన్నారు. మాజీ ప్రధాని నెహ్రూ నుంచి.. ఇప్పటివరకు రైతులకే తొలి ప్రాధాన్యం ఇస్తున్నది కాంగ్రెస్ పార్టీయేనని సీఎం తెలిపారు. అలానే రేషన్ కార్డులపై సన్నబియ్యం పంపిణీ చేస్తామని సీఎం ప్రకటించారు.
పాలమూరులో జరిగిన రైతు పండుగలో వేలాది మంది రైతులు పాల్గొని ఆశ్వీరాదం అందించారని రేవంత్ సంతోషం వ్యక్తం చేశారు. రైతుల ఆశ్వీరాదం ప్రభుత్వానికి గొప్ప శక్తిని ఇచ్చిందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 568 రైతు వేదికల నుంచి లక్షలాది మంది రైతులు రైతు పండుగలో పాల్గొన్నారన్నారు. వాస్తవాల ప్రాతిపదికన తమ ప్రభుత్వం భవిష్యత్తు కార్యాచరణను రూపొందించుకుంటోందన్నారు. రైతును రాజును చేయడమే లక్ష్యంగా తమ ప్రభుత్వం ముందుకు వెళ్తోందన్నారు. రుణమాఫీ, ఉచిత విద్యుత్, సబ్సిడీ ఎరువులు, మద్దతు ధర , ఉపాధి హామీ పథకం లాంటి వాటితో రైతులను ఆదుకుంటున్నామన్నారు. 2023 వానాకాలం రైతుబంధును కేసీఆర్ ఎగ్గొడితే.. తాము అధికారంలోకి రాగానే రూ.7,625 కోట్ల రూపాయలను రైతుబంధు కింద చెల్లించామన్నారు. ఇప్పటి వరకు 31 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని ప్రభుత్వం సేకరించిందని, వచ్చే సీజన్లో కూడా 500 రూపాయల బోనస్ కొనసాగుతుందన్నారు. తెలంగాణ భూముల్లో పండే ధాన్యాన్నే పేదలకు రేషన్ దుకాణాల్లో ఇస్తామని, సంక్షేమ హాస్టళ్లలో పిల్లలకు సన్న బియ్యంతో భోజనం పెడతామన్నారు.