అరుదైన అటవీ ఉత్పత్తుల గుర్తింపుతోపాటు కార్పొరేట్ స్థాయి మార్కెటింగ్ ద్వారా అడవిబిడ్డల జీవన స్థితిగతులు మెరుగుపర్చేందుకుఆంధ్రప్రదేశ్ అటవీశాఖ సరికొత్త ప్రణాళిక రూపొందిస్తోంది. దీనిలో భాగంగా ఆంధ్రప్రదేశ్ అటవీశాఖ, ఆంధ్రప్రదేశ్ అటవీ అభివృద్ది సంస్థ, ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ (ఐ.ఎస్.బి.) ఆధ్వర్యంలోని భర్తీ ఇనిస్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ పాలసీ సంస్థలు మెమోరాండం ఆఫ్ అండర్ స్టాండింగ్ కుదుర్చుకున్నాయి. అటవీశాఖ ప్రధాన కార్యాలయంలో శుక్రవారం జరిగిన త్రిసభ్య ఒప్పంద పత్రాలపై ఈ మూడు సంస్థల ప్రతినిధులు సంతకం చేశారు. అటవీ ఉత్పత్తుల నిర్వహణ, ఆధునిక సాంకేతికతను ఉపయోగించుకొని ముందుకు వెళ్లాల్సిన మార్పులు, గిరిజనుల జీవనశైలి మెరుగుపర్చడం మీద ఈ మూడు సంస్థలు సంయుక్తంగా దృష్టి పెట్టనున్నాయి.
ఈ ఎం.ఓ.యూ. ప్రకారం – అడవుల్లో దొరికే సహజ సిద్ధమైన సీజనల్ ఉత్పత్తుల గుర్తింపు, సేకరణ, మార్కెటింగ్ మీద ప్రధానంగా దృష్టి సారిస్తారు. పర్యావరణహితంగా అడవుల సాధారణ స్థితికి ఏ మాత్రం భంగం కలిగించకుండా డిజిటల్, జియోస్పాషియల్ సాంకేతికత ఆధారంగా అరుదుగా దొరికే ఉత్పత్తులను గుర్తిస్తారు. రాష్ట్రంలోని అడవుల్లో దొరికే అద్భుతమైన సంపదను దీనివల్ల గుర్తించడం సులభతరం అవుతుంది. ప్రాజెక్టులో ఆయా ప్రాంతాల్లోని స్థానిక గిరిజనులను భాగస్వామ్యం చేసి ముందుకు వెళ్తారు. ముఖ్యంగా గిరిజన మహిళలను దీనిలో భాగం చేసి వారిని ఆర్థికంగా బలోపేతం చేస్తారు. కలప ఉత్పత్తులను మినహాయించి ఇతర నాణ్యమైన, అరుదైన అటవీ ఉత్పత్తులకు అదనపు విలువ జోడించి మార్కెటింగ్, బ్రాండింగ్ చేయడం మీద దృష్టిపెడతారు.
40 శాతం మంది గిరిపుత్రులు అటవీ ఉత్పత్పుల మీద ఆధారపడి నేటికీ జీవనం సాగిస్తున్నారు. వారికి ఈ ఒప్పందం ప్రకారం మేలు జరుగుతుందని అటవీశాఖ అధికారులు వెల్లడించారు. ఈ ఒప్పంద కార్యక్రమంలో ఆంధ్ర ప్రదేశ్ అటవీ అభివృద్ధి సంస్థ ఎం.డి. రాజేంద్ర ప్రసాద్ కజారియా పాల్గొన్నారు.
గిరిపుత్రుల కోసం ఏపి ప్రభుత్వం ప్రత్యేక ప్రణాళిక
- Advertisement with us -