ఏపీపీఎస్సీ కీలక నిర్ణయం…
ఏపీపీఎస్సీలో పలు ఉద్యోగ నియామకాలకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్ధుల్లో చాలా మంది మెగా డిఎస్సీకి కూడా హాజరవుతుండటంతో ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమీషన్ కీలక నిర్ణయం తీసుకుంది. మెగా డిఎస్సీ రాత పరీక్షలు జూన్ 6వ తేదీ నుంచి జరగనున్నాయి. అదే జూన్ 6వ తేదీ నుంచి 26వ తారీఖుల మధ్య రాష్ట్రంలోని పలు ప్రభుత్వ ఉద్యోగాలకు శాఖపరమైన పరీక్షలతో పాటు ఇంటర్, డిగ్రీ, పాలిటెక్నిక్ కాలేజీ లెక్చరర్ల నియామకం కోసం పరీక్షల షెడ్యూల్ ఉంది. అయితే ఈ పరీక్షలకు హాజరయ్యే అభ్యర్ధుల్లో చాలా మంది మెగా డిఎస్సీకి కూడా సన్నద్దమవుతున్నారు. దానికి తోడు అన్ని పరీక్షలు ఒకే సారి నిర్వహించడానికి పరీక్షా కేంద్రాల లభ్యతకు కూడా ఇబ్బందులు తలెత్తే పరిస్ధితి ఉంది. వీటిని దృష్టిలో ఉంచుకుని ఏపీపీఎస్ పరీక్షలను వాయిదా వేసింది. ఈ పరీక్షలను తిరిగి ఎప్పుడు నిర్వహించేది త్వరలో తేదీలను తెలియజేస్తామని ఏపీపీఎస్సీ కార్యదర్శి పి.రాజబాబు ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మెగా డీఎస్సీ ఆన్లైన్ దరఖాస్తుల గడవు గత గురువారం అర్ధరాత్రితో ముగిసింది. ఈ మెగా డీఎస్సీ పరీక్ష కోసం రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 3,35,401 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. అన్ని పోస్టులకు కలిపి 5,77,417 దరఖాస్తులు వచ్చినట్లు విద్యాశాఖ వెల్లడించింది. అత్యధికంగా దరఖాస్తులు ఉమ్మడి కర్నూలు జిల్లా నుంచి వచ్చాయి. ఈ జిల్లాలో 39,997 మంది దరఖాస్తు చేశారు. ఇక అత్యల్పంగా కడప జిల్లా నుంచి వచ్చాయి. కేవలం 15,812 మంది మాత్రమే ఈ జిల్లాలో దరఖాస్తు చేశారు. ఇతర రాష్ట్రాలకు చెందిన వారు 7,159 మంది దరఖాస్తు చేసుకున్నట్లు విద్యాశాఖ వెల్లడించింది. ఈ మెగా డీఎస్సీలో మొత్తం 16,347 పోస్టులు భర్తీ చేయనున్నారు. డీఎస్సీ పరీక్షలకు మే 30 నుంచి హాల్టికెట్లను జారీ చేయనుంది. కంప్యూటర్ ఆధారిత ఆన్లైన్ రాత పరీక్షలు జూన్ 6 నుంచి జులై 6 వరకు నిర్వహించనున్నారు. ఇందుకు సంబంధించిన షెడ్యూల్ త్వరలోనే విడుదలకానుంది.
నాన్ లోకల్ కోటా కింద భారీగా దరఖాస్తులు
ఏపీలో మెగా డీఎస్సీ పోస్టుల కోసం ఇతర రాష్ట్రాల అభ్యర్థులు కూడా పోటీ పడుతున్నారు. ముఖ్యంగా తెలంగాణ నుంచి వేలాది మంది అప్లై చేసుకున్నారు. నాన్ లోకల్ కోటా కింద వీరు దరఖాస్తు చేసుకున్నారు. మెగా డీఎస్సీకి సంబంధించి నాన్ లోకల్ కోటా కింద 20 శాతం పోస్టులను కేటాయించారు. వాటికి ఏపీతోపాటు.. ఏ రాష్ట్రం వారైనా పోటీపడవచ్చు. అయితే.. టెన్త్లో సెకెండ్ లాంగ్వేజ్ తెలుగు తప్పనిసరిగా ఉండాలి. నాన్ లోకల్ కోటా పోస్టుల కోసం.. ఏపీ సరిహద్దు జిల్లాలైన ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, గద్వాల, నారాయణపేట నుంచి ఎక్కువమంది దరఖాస్తు చేసుకున్నారు. సరిహద్దు జిల్లాలే కాకుండా.. రంగారెడ్డి, వికారాబాద్, ఆదిలాబాద్, సిద్ధిపేట, నిర్మల్, వరంగల్ జిల్లాలకు చెందిన అభ్యర్థులు కూడా అప్లై చేసుకున్నట్టు తెలుస్తోంది. డీఎస్సీ పరీక్షలను జూన్ 6వ తేదీ నుంచి జులై 6వ తేదీ వరకు నెల రోజుల పాటు నిర్వహించనున్నారు.