- మూడేళ్ళ విద్యుత్ ప్రణాళికలు సిద్దం చేయండి
- విద్యుత్ శాఖను సమీక్షించిన సీయం రేవంత్ రెడ్డి
ప్రభుత్వం తీసుకువచ్చే ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్టుల వల్ల వచ్చే మూడు సంవత్సరాల్లో విద్యుత్ డిమాండ్ భారీగా పెరుగుతుందని అందువల్ల రానున్న మూడేళ్ళ విద్యుత్ అవసరాలు అధిగమించడానికి ప్రణాళికలు సిద్దం చేసుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. శుక్రవారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విద్యుత్ శాఖపై సమీక్ష నిర్వహించారు. ఈసమావేశంలో సీయం రేవంత్ రెడ్డి అధికారులకు పలు సూచనలు చేశారు. రాష్ట్రంలో నిర్మించే నీటిపారుదల ప్రాజెక్టుల విద్యుత్ అవసరాలను కూడా దృష్టిలో పెట్టుకోవాలని సీయం సూచించారు. వీటితో పాటు రైల్వే లైన్లు, మెట్రో, ఇతర మాస్ ట్రాన్స్ పోర్ట్ వ్యవస్ధల విద్యుత్ అవసరాలను కూడా పరిగణనలోకి తీసుకోవాలని చెప్పారు. గ్రేటర్ హైదరాబాద్ తో పాటు ఇతర కార్పొరేషన్ల విద్యుత్ అవసరాలతో పాటు కొత్తగా ఏర్పాటు చేయబోయే డేటా సెంటర్లు, పారిశ్రామిక వాడలకు కావల్సిన విద్యుత్ అవసరాలను దృష్టిలో ఉంచుకోవాలని సీయం అధికారులకు వివరించారు. భవిష్యత్తులో హైదరాబాద్ డేటా సెంటర్ల హబ్ గా మారబోతోందని ఇక్కడ డేటా సిటీని ఏర్పాటు చేయబోతున్నట్లు సీయం ప్రకటించారు.
రీజనల్ రింగ్ రోడ్డు పరిధి లో నిర్మించే రేడియల్ రోడ్లు, శాటిలైట్ టౌన్ షిప్ లకు కావాల్సిన విద్యుత్ అవసరాలపైన హెచ్ఎండీఎ తో సమన్వయం చేసుకోవాలని అధికారులకు చెప్పారు. క్షేత్ర స్ధాయిలో విద్యుత్ డిమాండ్ కు అనుగుణంగా సబ్ స్టేషన్ల అప్ గ్రేడ్ చేసుకోవాలన్నారు. విద్యుత్ లైన్ల ఆధునీకరణ పైన దృష్టి పెట్టాలన్నారు. ఫ్యూచర్ సిటీలో పూర్తిగా భూగర్భ విద్యుత్ లైన్లు ఏర్పాటు చేయాలని అధికారులకు తెలిపారు. ఎక్కడా విద్యుత్ టవర్లు, పోల్స్, లైన్లు బహిరంగంగా కనిపించడానికి వీలు లేదన్నారు. అలాగే గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో స్మార్ట్ పోల్స్ ను ప్రయోగాత్మకంగా ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ముందుగా సచివాలయం, నక్లెస్ రోడ్, కేబీఆర్ పార్క్ వంటి ప్రాంతాల్లో స్మార్ట్ పోల్స్ ఏర్పాటు చేయాలని సీయం విద్యుత్ శాఖ అధికారులకు సూచించారు. అవుటర్ రింగురోడ్డు 160 కిలోమీటర్ల పొడవునా సోలార్ విద్యుత్ ఉత్పత్తి కోసం కావాల్సిన ప్రణాళికలను సిద్దం చేయాలని అధికారులకు చెప్పారు.
ఈ సంవత్సరంలో అత్యధికంగా 17 వేల 162 మెగావాట్లకు విద్యుత్ డిమాండ్ చేరుకుందని విద్యుత్ శాఖ అధికారులు ముఖ్యమంత్రికి గణాంకాలతో సహా వివరించారు. గత యేడాదితో పోలిస్తే ఈ సంవత్సరం విద్యుత్ డిమాండ్ 9.8 శాతం పెరిగిందని సీయం దృష్టికి తీసుకువెళ్ళారు. రానున్న రెండేళ్లలో 18వేల 138 మెగావాట్ల డిమాండ్ పెరుగుతుందనే అంచనా వేసినట్లు తెలిపారు. 2034 – 35 నాటికి విద్యుత్ డిమాండ్ 31వేల 808 మెగావాట్లకు చేరుకునే అవకాశం ఉందని అధికారులకు సీయంకు వివరించారు. ఎటువంటి అంతరాయం లేకుండా నాణ్యమైన విద్యుత్ ను అందిస్తున్నట్లు విద్యుత్ శాఖ అధికారులు ముఖ్యమంత్రికి తెలియజేశారు.