ఆంధ్రప్రదేశ్ లో పర్యాటక రంగాభివృద్ధికి ఊతమిచ్చే విధంగా విశాఖపట్టణంలో నిర్మిస్తున్న గాజు వంతెన దాదాపు పూర్తి కావచ్చింది. దేశంలోనే అత్యంత పొడవైన గాజు వంతెనను విశాఖ తీరంలోని కైలాసగిరి వద్ద పర్యాటక శాఖ నిర్మిస్తోంది. దాదాపు 50 మీటర్ల పొడవుతో నిర్మిస్తున్న 50 మీటర్ల పొడవుతో నిర్మితమవుతున్న ఈ కాంటిలివర్ గ్లాస్ స్కైవాక్ వంతెన పర్యాటకులకు సరికొత్త అనుభూతిని అందించనుంది. దీనితో పాటు జిప్-లైన్లు, స్కై-సైక్లింగ్ ట్రాక్లు కూడా ఇక్కడ ఏర్పాటు చేస్తున్నారు. ఈ వంతెన పూర్తయితే, ప్రస్తుతం కేరళలోని వాగమోన్ గ్లాస్ బ్రిడ్జి రికార్డును కైలాసగిరి గాజు వంతెన బద్దలు కొడుతుంది. ఇక విశాఖపట్టణానికి ఈ గ్లాస్ స్కైవాక్ ఒక మణిహారంగా నిలిచిపోతుంది.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో టూరిజం అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ కనపరుస్తోంది. ప్రధానంగా సముద్ర తీర ప్రాంతాలను ఆకర్షణీయ పర్యాటక స్ధలాలుగా అభివృద్ధి చేసి ఏపీలో టూరిజాన్ని అభివృద్ధి చేయాలనే కృతనిశ్చయంతో ప్రభుత్వం ఉంది. ఈ క్రమంలోనే ఏపీ పర్యాటక శాక సముద్ర తీర ప్రాంతం వెంబడి అనేక అభివృద్ధి పనులు ప్రారంభించింది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో బెస్ట్ టూరిస్ట్ డెస్టినేషన్ గా విశాఖపట్నం ముందు వరుసలో నిలుస్తుంది. ముఖ్యంగా విశాఖ నగరాన్ని ఆనుకుని ఉన్న పొడవైన సముద్ర తీరం… తీరం వెంబడి భీమిలి దాటే వరకూ ఉన్న బీచ్లు పర్యాటకులకు ప్రధాన ఆకర్షణగా నిలుస్తున్నాయి. ఎత్తైన పర్వతాలు, లోయలతో కూడిని ప్రకృతి అందాలు పర్యాటకులను కట్టిపడేస్తున్నాయి, విశాఖ పోర్టు, మ్యూజియం, సింహాచలం, రామకృష్ణా బీచ్, భీమిలి బీచ్, కైలాసగిరి, తిరుమల తిరుపతి దేవస్ధానానికి చెందిన వెంకటేశ్వర స్వామి దేవాలయం, ఎర్రగుట్టలు ఇవన్నీ వైజాగ్ కు ప్రత్యేకం. వీటన్నింటికీ మించి విశాఖపట్నానికి అతి సమీపంలో ఉన్న అరకు, బొర్రా గుహలు ప్రపంచ వ్యాప్త పర్యాటకులను ఆకట్టుకుంటూ ఉంటాయి. ఇప్పుడు విశాఖ సిగలో మరో మకుటంలా గాజు వంతెను చేరబోతోంది. భారతదేశంలోనే అతి పొడవైన కాంటిలివర్ గ్లాస్ స్కైవాక్ వంతెన 50 మీట్ల పొడవున నిర్మాణ పూర్తి చేసుకుంది. కైలాశగిరి మీద టైటానిక్ వ్యూపాయింట్కు దగ్గరగా ఈ గాజు వంతెనను నిర్మిస్తున్నారు.
ఈ గ్లాస్ వంతెన అందుబాటులోకి వస్తే విశాఖ నగరానికి పర్యాటకుల తాకిడి ఇబ్బడి ముబ్బడిగా పెరిగే అవకాశం ఉంది. భూమికి అందనంత ఎత్తులో గాజు వంతెనపై నడవడం ప్రతి ఒక్కరికీ ఒక మధురానుభూతిని మిగులుస్తుంది. సముద్రపు అందాలతో పాటు ప్రకృతి సౌందర్యాలను ఆకాశం నుంచి వీక్షించేలా ప్రకృతి ప్రేమికులకు, సాహస యాత్రికులకు ఈ గ్లాస్ స్కైవాక్ మరపురాని అనుభవాన్ని అందించనుంది. ఈ గాజు వంతెన నిర్మాణానికి ఆరు కోట్ల రూపాయలు ఖర్చవుతుందని అంచనా. గత సంవత్సరం నవంబర్ మాసంలో గాజు వంతెన నిర్మాణం ప్రారంభమయ్యింది. ప్రస్తుతం నిర్మాణ పనులు తుది దశకు చేరుకున్నాయి. ప్రభుత్వ-ప్రైవేట్ భాగస్వామ్యంలో దీనిని నిర్మిస్తున్నారు. విశాఖపట్నం మెట్రోపాలిటన్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీతో పాటు ప్రైవేట్ సంస్థలు ఈ గాజు వంతెన నిర్మాణంలో పాలుపంచుకుంటున్నాయి. ఒకేసారి 40 మంది వరకూ దీనిపై నిల్చునేలా ఈ గాజు వంతెన నిర్మిస్తున్నారు. స్కైవాక్తో పాటు, రెండు జిప్-లైన్లు, స్కై-సైక్లింగ్ ట్రాక్లు ఏర్పాటు చేస్తున్నారు. ఒక్కొక్కటి 150 మీటర్లు విస్తరించి ఉన్నాయి. ప్రస్తుతం కేరళలోని వాగమోన్ గ్లాస్ బ్రిడ్జి భారతదేశంలోనే అత్యంత పొడవైన గాజు వంతెనగా పేరొందింది. ఇది 40 మీటర్ల పొడవు ఉంటుంది. కైలాసగిరి స్కైవాక్ నిర్మాణం పూర్తి అయితే ఆ రికార్డును విశాఖపట్నం స్కైవాక్ అధిగమించనుంది.