-
బీసీ మహిళలను అడ్డం పెట్టుకొని భారీ దోపిడీ
-
1,02,832 మంది మహిళల పేరుతో 154 కోట్లు దోచుకుంటున్న కూటమి ప్రభుత్వం
-
ఒక్కో లబ్ధిదారు పేరుతో సుమారు 16 వేల స్వాహా
-
టిడిపి అవినీతిపై అమలాపురం వైసీపీ పార్లమెంటరీ అబ్జర్వర్ జక్కంపూడి విజయ లక్ష్మి
చంద్రబాబు నాయకత్వంలో స్కీములన్నీ స్కాములేననని, టిడిపి అవినీతిపై అమలాపురంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ధర్నా కార్యక్రమంలో అమలాపురం పార్లమెంటరీ అబ్జర్వర్ జక్కంపూడి విజయలక్ష్మి ఆరోపించారు. పైకి మాత్రం ప్రతి ఇంటి నుంచి ఓ మహిళను పారిశ్రామిక వేత్తగా చేయాలన్నదే తన లక్ష్యం అంటూ పెద్ద పెద్ద మాటలు చెబుతూ, లోపల మాత్రం 1,02,832 మంది బీసీ మహిళలు ఒకొక్కరి పేరుతో 16,000/- దోపిడి చేసి, తన వాళ్ళ జేబులు నింపారని ఆమె అన్నారు.
అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా బాబు ఆర్భాటంగా ప్రకటించిన కుట్టు మిషన్ శిక్షణ పథకం గుట్టును విప్పుతూ, ఒక్కో మహిళ కు ఉచిత కుట్టు మెషీన్, శిక్షణకు రూ.7,300 వంతున రూ. 73 కోట్లు ఖర్చు అవుతుండగా, ఒకొక్కరి ఖర్చును భారీగా పెంచి మొత్తం రూ.230 కోట్లకు టెండర్ ఆమోదించి భారీ దోపిడీకి తెరతీశారన్నారు. తక్కువ ఖర్చుతో టెండర్ దాఖలు చేసిన కంపెనీలను వదిలి, తక్కువ ధర కోట చేసిన కంపెనీకి 5% పనులే ఇచ్చి, ఎక్కువ ధర కోట్ చేసిన తమ అనుయాయులకు 95% పనులు అప్పచెప్పారని విజయలక్ష్మి ఆరోపించారు.
నిబంధనల ప్రకారం ఒక్కో లబ్ధిదారుకి 45 రోజులపాటు దాదాపు 360 గంటల శిక్షణ ఇవ్వాల్సి ఉంటే, కేవలం 135 గంటలు మాత్రమే శిక్షణ ఇచ్చి చేతులు దులిపేసుకుంటున్నారని ఆమె దుయ్య బట్టారు, ఇంకా చాలా చోట్ల శిక్షణ అమల్లోకి రాకున్నా మొబిలైజేషన్ అడ్వాన్సు కింద రూ.25 కోట్లను కాంట్రాక్టర్లకు దోచిపెట్టేందుకు రంగం సిద్ధమవుతోందని, తన ఆక్రమాల్లో ఎవ్వరినీ వదిలి పెట్టని బాబు , ఈ సారి ప్రభుత్వ ఖజానాను దోచుకోవడానికి బీసీ మహిళలను పావులుగా వాడుకుంటున్నారని విజయలక్ష్మి ఎద్దేవా చేశారు.
ఇది బీసీ మహిళల అభ్యున్నతి పధకం కాదని, కూటమి నేతల దోపిడి పధకం అని విజయలక్ష్మి పేర్కొన్నారు. ఆర్థికంగా వెనుకబడిన మహిళల పేరుతో జరుగుతున్న అక్రమాల స్కాంను ప్రజలకు వివరించి, ప్రజాధనం వృథా కాకుండా అడ్డుకుంటామని, కూటమి ప్రభుత్వం చేస్తున్న దోపిడిని బట్టబయలు చేస్తామని విజయ లక్ష్మి హెచ్చరించారు.