తెలుగు రాష్ట్రాల్లో ప్రముఖ ఫైనాన్షియల్ అడ్వైజర్, తెలుగు అసెట్స్ ఫౌండర్ శ్రీనివాస్ చీకటి రచించిన ‘మనీ విటమిన్’ పుస్తకావిష్కరణ బుధవారం ఉదయం ఉప్పల్ భగాయత్లో జరిగింది. మనదేశంలోనే కాదు.. విదేశాల్లో కూడా ఉన్న పలు పరిశ్రమలకు దాదాపు రెండు దశాబ్దాల పాటు టెక్నికల్ అడ్వైజర్గా పనిచేసిన శ్రీనివాస్ చీకటి.. నష్టాల్లో ఉన్న కంపెనీలను లాభాల బాట పట్టించారు. కరోనా సమయంలో జనజీవనం అస్తవ్యస్థమైన పరిస్థితుల్లో ఆర్థిక క్రమశిక్షణపై ప్రజలను చైతన్యవంతం చేయాలని నిర్ణయించుకున్నారు.
ఉద్యోగ నిర్వహణలో తన అనుభవాలను, పుస్తక పఠనంతో తనకు లభించిన విజ్ఞానాన్ని తెలుగు ప్రజలకు అందించాలనే ఉద్దేశ్యంతో తెలుగు అసెట్స్ అనే మాధ్యమం ద్వారా నిత్యం ఆర్థిక పాఠాలను అందిస్తున్నారు. ప్రజలకు నిత్యం తాను చెబుతున్న పాఠాలనే రంగరించి పుస్తకరూపంలో తీసుకొచ్చారు. ‘ధనవంతులు ఎలా ఆలోచిస్తారు? ధనవంతుల మైండ్సెట్ను అందరూ ఎలా అలవర్చుకోవాలి ?’ అనే కోణంలో ఈ పుస్తకం రాశారు. ఈ మనీ విటమిన్ పుస్తకావిష్కరణ కార్యక్రమంలో శ్రీనివాస్ చీకటితో పాటు.. ప్రముఖ ఫైనాన్షియల్ అడ్వైజర్ రాంప్రసాద్, ప్రముఖ రియల్ ఎస్టేట్ నిపుణులు వెంకట్రాజ్, ఓం ప్రకాష్, ఎడ్యుకేటర్ వశిష్ఠ తదితరులు పాల్గొన్నారు. ఈ పుస్తకం ప్రతి ఒక్కరికీ ప్రయోజనకరంగా ఉంటుందని, ప్రతి కుటుంబం ఆర్థికంగా ఎలా నిలదొక్కుకోవాలో ఈ పుస్తకంలో వివరించారని అతిథులు ఈ సందర్భంగా శ్రీనివాస్ చీకటిని అభినందించారు.