- సెలబ్రిటీలు, ఇన్ఫ్లుయెన్షర్లు సోషల్ మీడియాలో ఏది పడితే అది పెట్టద్దు
- దేశద్రోహులపై పోలీసులకు ఫిర్యాదు చెయ్యండి
- ఆపరేషన్ సింధూర విజయవంతమ్యింది… డిప్యూటీ సీయం పవన్ కళ్యాణ్
ఆపరేషన్ సింధూర్ అమలు చేయడం ద్వారా భారత ఆర్మీ సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకుందని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అన్నారు. బుధవారం హైదరాబాద్ లోని ఆయన నివాసం వద్ద మీడియాతో మాట్లాడిన పవన్ కళ్యాణ్ ఆపరేషన్ సింధూర్ విజయవంతంగా ముగించిన భారత వైమానిక దళాన్ని ఆయన అభినందించారు. సామాన్య జనాలకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా తీవ్రవాదులను మట్టుపెట్టడం గమనించాల్సిన విషయమన్నారు. పెహల్గాంలో తీవ్రవాదులు సామాన్య పర్యాటకులను మతం అడిగి మరీ చంపారని పవన్ కళ్యాణ్ గుర్తు చేశారు. కాశ్మీర్ అనేది భారత దేశంలో అంతర్భాగమని అయినా అక్కడ 90వ దశకంలో కాశ్మీరీ పండిట్లను చంపారని, వారి అంత్య క్రియలు చేయడానికి వచ్చిన వారిని కూడా కూడా చంపారని పవన్ కళ్యాణ్ అన్నారు. మిలటరీ సరిహద్దుల్లో యుద్దం చేస్తుంటే మనం ఇక్కడ ఏమి చేయాలో అందరికీ అర్ధమయ్యేలా చెప్పడానికే మాక్ డ్రిల్ కార్యక్రమం నిర్వహిస్తు్న్నట్లు డిప్యూటీ సీయం తెలిపారు. ఇటువంటి పరిస్ధితుల్లో ఆర్మీపై ఎవరూ అనుచిత వ్యాఖ్యలు చేయవద్దని ఆయన కోరారు. నేను అందరినీ ఉద్దేశించి మాట్లాడటం లేదని, కొంత మంది కాంగ్రెస్ నాయకులను ఉద్దేశించే ఈ వ్యాఖ్యలు చేస్తున్నానని పాకిస్తాన్ ని ప్రోత్సహిస్తున్నట్లు మాట్లాడవద్దని పవన్ కళ్యాణ్ సూచించారు. కుక్కలు అరచినట్లు సోషల్ మీడియాలో ఎవరూ అరవద్దన్నారు. దేశానికి వ్యతిరేకంగా ఎవరు సోషల్ మీడియాలో పోస్టులు పెట్టినా అటువంటి దేశ ద్రోహులకు సరైన సమాధానం చెప్పడంతో పాటు పోలీసులకు కూడా ఫిర్యాదు చేయాలని పవన్ కళ్యాణ్ చెప్పారు. ముఖ్యంగా సెలబ్రిటీలు, ఇన్ఫ్లుయెన్షర్లు సోషల్ మీడియాలో ఏది పడితే అది పెట్టద్దని డిప్యూటీ సీయం పవన్ కళ్యాణ్ హితవు పలికారు. పార్టీలకు అతీతంగా అందరూ మోడీకి మద్దతుగా నిలవాలని పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చారు.