హైదరాబాద్ నగరం అంతర్జాతీయ కిరీటం ధరించబోతుంది. 72వ మిస్ వరల్డ్ పోటీలు ఈ నెల 10వ తేదీ నుంచి 31వ తేదీ వరకు గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో జరగనున్నాయి. ఈ వేడుకల కోసం రంగం సిద్ధమైంది. ఈ కార్యక్రమాన్ని తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తుండగా, పర్యాటక శాఖ ఏర్పాట్లను పర్యవేక్షిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా 120 దేశాల నుంచి అందగత్తెలు ఈ పోటీల్లో పాల్గొంటున్నారు. వారందరినీ సంప్రదాయ పద్ధతిలో స్వాగతించేందుకు ఏర్పాట్లు జోరుగా కొనసాగుతున్నాయి.
ఈ పోటీల పట్ల ప్రజల్లో ఆసక్తిని రేకెత్తించేందుకు సెలబ్రిటీలు, స్పోర్ట్స్ స్టార్లతో ప్రచారం చేస్తున్నారు.”తెలంగాణ జరూర్ ఆనా” అనే నినాదంతో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఈ థీమ్తో బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధూ చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అందం, సంస్కృతి, ఐక్యతకు ప్రతీకగా నిలిచే ఈ వేడుక కోసం ఆమె ద్వారా ఆహ్వానించడమే కాదు.. పలువురికి ప్రేరణనిచ్చేలా ఉంది.
ఈ ఘనతను చాటేందుకు విదేశాల నుంచి బ్యూటీ క్వీన్లు హైదరాబాద్లో అడుగుపెడుతున్నారు. ఇప్పటికే మిస్ సౌత్ ఆఫ్రికా జోయలైజ్ జన్సన్ వాన్ రెన్స్ బర్గ్, మిస్ బ్రెజిల్ జెస్సికా పెడ్రోసో, మిస్ కెనడా ఎమ్మా డయన్నా క్యాథరీన్ మొర్రిసన్, మిస్ వరల్డ్ చైర్ పర్సన్ జూలియా మోర్లీ హైదరాబాద్కి చేరుకున్నారు. పోర్చుగల్కు చెందిన మారియా అమెలియా, ఘనా నుంచి జుట్టా అడ్డో, ఐర్లాండ్కు చెందిన జాస్మిన్లు కూడా వచ్చారు. వీరికి తెలంగాణ సంప్రదాయాల ప్రకారం ఘనంగా స్వాగతం పలుకుతున్నారు.
ఈ పోటీలు తెలంగాణ సాంస్కృతిక వైభవాన్ని ప్రపంచానికి పరిచయం చేసే అరుదైన అవకాశంగా ప్రభుత్వం చెబుతోంది. రాష్ట్రం తరఫున ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలనే ఉత్సాహం పర్యాటక శాఖలో స్పష్టంగా కనిపిస్తోంది. మిస్ వరల్డ్ చైర్ పర్సన్ జూలియా మోర్లీ సైతం అధికారులతో కలిసి ఏర్పాట్లను సమీక్షిస్తున్నారు. ప్రతిష్ఠాత్మకమైన ఈ ప్రపంచ వేడుకతో తెలంగాణ అంతర్జాతీయ స్థాయిలో మరో మెట్టు ఎక్కబోతోంది.