పాకిస్తాన్ నుంచి దిగుమతులపై భారత ప్రభుత్వం కొరడా ఝలిపిస్తోంది. కేంద్ర ప్రభుత్వం ఆదేశాల నేపథ్యంలో వ్యాపారులు పెద్ద ఎత్తున రాక్ సాల్ట్ ఆర్డర్స్ను రద్దు చేశారు. కొత్తగా పాక్కు ఆర్డర్ ఇవ్వడం ఆపేశారు. రాక్సాల్ట్, డ్రై ఫ్రూట్స్ సహా పలు ఉత్పత్తులు దిగుమతి అవుతాయి. చాంబర్ ఆఫ్ ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్ అసోసియేషన్కు చెందిన అశోక్ లాల్వానీ మాట్లాడుతూ రాక్ సాల్ట్ (కల్లుప్పు) ఉప్పు, ఖర్జూరం, నల్ల ఎండుద్రాక్ష, సబ్జా సీడ్స్ పాకిస్తాన్ నుంచి దిగుమతి అవుతున్నాయి.
ఆఫ్గనిస్తాన్ నుంచి పాకిస్తాన్ మీదుగా అంజూర పండ్లు, ఎండుద్రాక్ష దిగుమతి అవుతున్నాయి. ప్రతి నెలా 250 నుండి 300 టన్నుల రాక్ సాల్ట్, 550-600 టన్నుల ఖర్జూరం, 15 టన్నుల పిస్తా-నల్ల ఎండుద్రాక్ష, సబ్జా సీడ్స్ వ్యాపారం జరుగుతోంది. ఇవన్నీ వాఘ సరిహద్దు ద్వారా వస్తాయి.
తాజా నిర్ణయంతో డ్రై ఫ్రూట్స్ ధరలు పెరిగే అవకాశం ఉంది. పాకిస్థాన్ లోని సింధ్ రాష్ట్రంలో రాక్ సాల్ట్(సింధ నమక్) విరివిగా లభిస్తుంది. ఇప్పుడు వాటిని ఇతర దేశాల ద్వారా దిగుమతి చేసుకోవల్సి ఉంటుంది. రవాణా ఖర్చు పెరుగుదలతో వాటి ధరలు ప్రభావితమయ్యే అవకాశం ఉంది. పత్తి పాక్ నుంచి దిగుమతి అవుతోంది. తాజా నిర్ణయంతో దిగుమతులు ఆగిపోయాయి. మరోవైపు బంగ్లాదేశ్ తో సత్సంబంధాలు లేకపోవడంతో కాటన్ వస్త్రాల దిగుమతి తగ్గిపోయింది.
పాకిస్థాన్ ఉప్పు ప్రత్యేకత
హిందువులు ఉపవాసం ఉండే సమయాల్లో ఈ ప్రత్యేకమైన ఉప్పును వాడుతారు. ఈ ఉప్పును కల్లుప్పు. హిమాలయన్ సాల్ట్, సింధ నమక్ తదితర పేర్లతో పిలుస్తారు. ఈ ఉప్పు పాకిస్తాన్ నుంచి భారత్కు దిగుమతి అవుతుంది. ఏళ్లుగా భారత్ ఈ ఉప్పును చౌకగా దిగుమతి చేసుకుంటోంది. ఈ ఉప్పుని శుద్ధి చేయరు. ఇందులో కాల్షియం, పొటాషియం, మెగ్నీషియం ఉంటాయి. సాధారణ ఉప్పుతో పోలిస్తే ఈ మూడు ఇందులో ఎక్కువగా ఉంటాయి. ఇది ఆరోగ్యానికి చాలా ఉపయోగకరంగా ఉంటుందని నిపుణులు పేర్కొంటున్నారు.
సింధు ప్రాంతం నుంచి వస్తున్నందున దీన్ని సింధ నమక్ అంటారు. పాకిస్తాన్లోని లాహోర్ నుంచి వాఘ సరిహద్దు నుంచి రావడంతో లాహోరీ ఉప్పు అని పంజాబ్ లో అంటారు. ప్రస్తుతం పాకిస్తాన్లోని వాయవ్య పంజాబ్లో నమక్ కోహ్ అనే ప్రసిద్ధ కొండ దగ్గర ఈ ఉప్పు కనిపిస్తుంది. ప్రపంచంలోనే రెండో అతిపెద్ద ఉప్పు గని అయిన ‘ఖేవ్దా సాల్ట్ మైన్’ ఉంది. అంటారియోలోని సిఫ్టో కెనడా సాల్ట్ మైన్స్ ప్రపంచంలోనే మొదటి స్థానంలో ఉన్నది. ఖేవ్దా సాల్ట్ మైన్ నుంచి ఏటా 4.65 లక్షల టన్నుల ఉప్పు వెలికి తీస్తుండగా.. రాబోయే 500 సంవత్సరాలకు ఇక్కడి నుంచే ఉప్పు సరఫరా అవుతుందని పేర్కొంటున్నారు. ఖేవ్దా సాల్ట్ మైన్లో 40 కిలోమీటర్ల పొడవైన సొరంగం ఉన్నది. ఇక్కడి నుంచి సేకరించి ఉత్తర భారత ఉపఖండానికి సరఫరా చేస్తారు. భారత్ రాజస్థాన్లోని సంభార్ నది నుంచి ఈ ఉప్పు ఉత్పత్తి అవుతుంది. కానీ, తక్కువ పరిమాణంలోనే లభిస్తుంది. నాణ్యత సైతం తక్కువగా ఉంటుంది. ఈ ఉప్పును ఆహార పదార్థాలు, ఔషధాల తయారీలో వినియోగిస్తారు.
తెలుగు రాష్ట్రాల్లో ఇటీవల రాక్ సాల్ట్ అమ్మకాలు జరుగుతున్నాయి. రాజస్థాన్, పంజాబ్ నుంచి ట్రాక్టర్లలో పెద్ద బండరాళ్లుగా తీసుకొచ్చి వాటిని కిలోల మాదిరి అమ్ముతున్నారు.