- ఎవరికైనా బాధ కలిగిస్తే హృదయపూర్వక విచారం వ్యక్తం చేస్తున్నా
- రెట్రో ప్రీ రిలీజ్ లో చేసిన వ్యాఖ్యలు స్పందించిన విజయ్ దేవరకొండ
రెట్రో సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో తాను చేసిన వ్యాఖ్యలపై పలువురు పోలీసులకు ఫిర్యాదు చేయడం పట్ల హీరో విజయ్ దేవరకొండ స్పందించారు. ఆ ఈవెంట్లో పహల్గామ్ దాడిని ఉద్దేశించి తాను ఐదు వందల ఏళ్ల కింద ట్రైబల్స్ కొట్టుకున్నట్టు పాకిస్తాన్ వాళ్ళు బుద్ధి లేకుండా చేసే పనులు ఇవి’ అంటూ చేసిన వ్యాఖ్యలు తాను ఎవరినీ ఉద్దేశించి మాట్లాడినవి కావని వివరణ ఇస్తూ ప్రకటన విడుదల చేశారు. ఈ వ్యాఖ్యలు కొంత మంది ప్రజల్లో ఆందోళన కలిగించాయని నా దృష్టికి వచ్చిందని, అయితే ఏ సమూహాన్ని, ముఖ్యంగా మన షెడ్యూల్డ్ తెగలను బాధపెట్టడం గానీ వారిని లక్ష్యంగా చేసుకుని మాట్లాడటం నా ఉద్దేశం కాదని స్పష్టం చేశారు. వారిని నేను ఎంతో గౌరవిస్తానని, మన దేశంలో అంతర్భాగంగా భావిస్తానని ఆ ప్రకటనలో పేర్కొన్నారు. స్వతహగా నేను ఎవ్వరి మీదా వివక్షతా భావంతో ఉండనని, అందరినీ నా కుటుంబ సభ్యులుగా, సోదరుల్లా చూస్తానని తెలిపారు. వాస్తవానికి శతాబ్ధాల క్రితం మానవ సమాజం తెగలు, వంశాలుగా వ్యవస్ధీకృతమై తరచు ఘర్షణలతో ఉండేదని నేను అదే ఉద్దేశంతో పాకిస్తాన్ ని ఉద్దేశించి వ్యాఖ్యానించినట్లు విజయ్ దేవరకొండ వివరించారు. తెగ అనే పదం 20వ శతాబ్ధం మధ్యలోనే అధికారికంగా వ్యవహారికంలోకి తీసుకు వచ్చారని ఆయన గుర్తు చేశారు. ఆంగ్ల నిఘంటువు ప్రకారం కూడా తెగ అంటే సామాజిక, ఆర్థిక, మతపరమైన లేదా రక్త సంబంధాలతో ముడిపడి ఉన్న సమూహాలని అర్ధం వస్తుందని, నా వాఖ్యల్లో ఏదైనా తప్పు అర్ధం వచ్చి ఎవరికైనా బాధ కలించినా నేను హృదయ పూర్వకంగా విచారం వ్యక్తం చేస్తున్నానంటూ విజయ్ దేవరకొండ తన ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశారు.