రాంగ్రూట్లో వెళ్తే ట్రాఫిక్ పోలీస్ ఫోటో కొట్టి ఫైన్ వేయడం మనకు తెలిసిన విషయమే. అయితే ఎక్కడైనా ట్రాఫిక్ పోలీస్ లేడని తెలిస్తే వాహనదారులు ఇష్టం వచ్చినట్లు వెళ్తూ ఉంటారు. రాంగ్ రూట్లో వెళ్లి ప్రమాదాలకు కారణమైన వారిని మనం నిత్యం చూస్తూనే ఉంటాం. అందుకే ఇప్పుడు ట్రాఫిక్ పోలీసులు కొత్త రూల్ తీసుకువచ్చారు. రాంగ్ రూట్లో వెళ్తున్న వాహనదారులను ఎవరైనా ఫోటో తీసి పంపిస్తే.. ఉల్లంఘించిన వారికి జరిమానాలు వేసే నిర్ణయం తాజాగా అమల్లోకి వచ్చింది.
హైదరాబాద్ లో వాహనాలు పెరిగిపోతూనే ఉన్నాయి. ట్రాఫిక్ కూడా నిత్యం పెరుగుతూనే ఉంది. ట్రాఫిక్ ఉల్లంఘించి వెళ్లే వాహనదారుల సంఖ్య కూడా అదే స్థాయిలో పెరుగుతోంది. దీంతో ఎక్కడికక్కడ ప్రమాదాలు జరుగుతున్నాయి. అందులో రాంగ్ రూట్ కారణంగా జరిగే ప్రమాదాలు, మరణాల సంఖ్య ఎక్కువగా ఉండటం తీవ్ర ఆందోళనకు గురి చేస్తోంది. ఈ నేపథ్యంలో సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు.. రాంగ్ రూట్లో వెళ్లే వాహనదారుల భరతం పట్టేందుకు సిద్ధం అయ్యారు. ఎవరైనా రాంగ్ రూట్లో వెళ్తే వారి జేబులకు చిల్లులు పడేలా ఫైన్లు వేస్తున్నారు. ఇదంతా ట్రాఫిక్ పోలీసులు ఉండే జంక్షన్ల మాత్రమే ఇప్పటివరకు ఉండేది.
ఇక నుంచి సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో ఇలాంటి రాంగ్ రూట్ డ్రైవింగ్ లేకుండా చేసేందుకు అధికారులు చర్యలు తీసుకున్నారు. ఇందులో భాగంగా ట్రాఫిక్ పోలీస్ లేని ప్రాంతాల్లో రాంగ్రూట్లో వెళ్లే వాహనదారుల ఫోటోలు తీసే అధికారాన్ని సాధారణ ప్రజలకు, వాహనదారులకు కల్పించారు. ఎవరైనా రాంగ్ రూట్లో వెళ్లినట్లు గమనిస్తే.. వారి వాహనం ఫోటో తీసి తమకు పంపిస్తే.. అలాంటి వారికి ఫైన్లు విధిస్తామని సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు కొత్త రూల్ తీసుకువచ్చారు.
ఈ క్రమంలో సైబరాబాద్ ట్రాఫిక్ పోలీస్ అధికారిక ఎక్స్ ఖాతాలో ఒక ఆసక్తికరమైన ట్వీట్ పెట్టారు. ట్రాఫిక్ రూల్స్ అతిక్రమించి రాంగ్రూట్లో వెళ్లే వాహనాల ఫోటోలు, వీడియోలు తీసి పంపాలని విజ్ఞప్తి చేశారు. అలాంటి ఫోటోలు వీడియోలను తమ వాట్సాప్ నెంబర్ 9490617346కు పంపించాలని.. వాటితోపాటు ఆ వాహనం లొకేషన్, టైమ్, డేట్ వంటి పూర్తి వివరాలను పంపించాలని ట్వీట్లో సూచించారు. ట్రాఫిక్ నియమాలు అతిక్రమించి.. రాంగ్ రూట్లో వెళ్లిన వాహనదారులకు జరిమానాలు విధించి.. సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ముక్కుపిండి వసూలు చేయనున్నారు. మే 1వ తేదీ నుంచే ఈ కొత్త నిబంధన అమల్లోకి వస్తుందని పేర్కొన్నారు. పంపిన వివరాలను గోప్యంగా ఉంచుతామని ప్రకటించారు. రాంగ్ రూట్లో వాహనదారులు ప్రయాణాలు చేయకుండా ఉండేందుకు సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు తీసుకువచ్చిన ఈ రూల్కు సంబంధించిన ట్వీట్కు నెటిజన్లు మద్దతు తెలుపుతూ రీట్వీట్లు, కామెంట్లు చేస్తున్నారు.