ప్రధాని నరేంద్ర మోదీ మే 2వ తేదీన అమరావతిలో పర్యటించనున్నారు. ఈ పర్యటనకు సంబంధించి ఏర్పాట్లను రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ మంగళవారం అధికారులతో కలిసి సమీక్షించారు. సభా వేదిక, పార్కింగ్ ప్రాంతాలు, వేదిక వద్దకు చేరుకునే మార్గాలు తదితర అంశాలను మంత్రి పరిశీలించారు.
ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ, “ప్రధాని పర్యటనకు 90 శాతం ఏర్పాట్లు పూర్తయ్యాయి. బుధవారం కల్లా మిగిలిన ఏర్పాట్లన్నీ పూర్తి చేస్తాం” అని తెలిపారు. మే 2న మధ్యాహ్నం 3.25కి ప్రధాని అమరావతికి చేరుకుంటారని చెప్పారు.
అమరావతిని అంతర్జాతీయ రాజధానిగా అభివృద్ధి చేయాలన్న లక్ష్యంతో ముఖ్యమంత్రి దిశానిర్దేశం చేశారని, సింగపూర్ సహకారంతో మాస్టర్ ప్లాన్ రూపొందించామని తెలిపారు. “365 కిలోమీటర్ల ట్రంక్ రోడ్లు, 1500 కిలోమీటర్ల లేఅవుట్ రోడ్ల నిర్మాణం కోసం ప్లాన్ చేశాం. గతంలోనే రూ.41 వేల కోట్ల పనులు ప్రారంభమయ్యాయి. 2019 కు ముందు రూ.5 వేల కోట్ల బిల్లులు చెల్లించాం” అని నారాయణ చెప్పారు. కూటమి ప్రభుత్వం మళ్లీ అధికారంలోకి వచ్చాక అమరావతి పనులను మళ్లీ ప్రారంభించామని, రివర్స్ టెండరింగ్, జ్యుడిషియల్ ప్రివ్యూలతో న్యాయ సమస్యలు లేకుండా ముందుకెళ్లేందుకు సమయం పట్టిందని నారాయణ తెలిపారు.
ప్రధాని మోదీ చేతుల మీదుగా రూ.43 వేల కోట్ల విలువైన అభివృద్ధి పనులను ప్రారంభించనున్నట్టు మంత్రి నారాయణ తెలిపారు. మూడేళ్లలో రాజధాని పనులను పూర్తి చేస్తామన్నారు. 29 గ్రామాల రైతులను సభకు రావాలని స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు ఆహ్వానించారని, అమరావతిపై పార్లమెంటులో చట్టం చేయాలని రైతులు కోరుతున్నారని ఈ అంశాన్ని సీఎం అధికారులతో చర్చించారని మంత్రి నారాయణ పేర్కొన్నారు.