-
దిగువదేశాలను భయపెడుతున్న వాటర్ బాంబ్
-
ఎగువ ప్రాజెక్టుల్లో నీటిని నిల్వ చేసి సడెన్ గా వదలడం
-
అలా వదిలితే ఊళ్లకు ఊళ్లే కొట్టుకుపోయే ఛాన్స్
-
పాకిస్థాన్ పై వాటర్ బాంబ్ ప్రయోగం కష్టమే
-
మన ఎగువన ఉన్న చైనాయే అందుకు కారణం
-
చైనా వాటర్ బాంబ్ ప్రయోగిస్తే భారత్ కు తీవ్రనష్టం
-
ఇప్పటికే కుప్పలుగా చైనా డ్యామ్ ల నిర్మాణం
-
పాక్ పై మనం స్పందిస్తే మనపై చైనా స్పందించే ఛాన్స్
పెహల్గాం దాడికి నిరసనగా భారత్ చేపట్టిన దౌత్యపరమైన చర్యలకు పాకిస్థాన్ దూకుడుగానే బదులిస్తోంది.పాకిస్థాన్ వైఖరిపట్ల తీవ్ర అసంతృప్తితో ఉన్న భారత్ సింధు జలవనరుల ఒప్పందాన్ని రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. అయితే ఇది ఆచరణలో సాధ్యం కాదు. ఎందుకంటే ఎగువ దేశంగా భారత్ కి డ్యాములు నిర్మించుకునే హక్కులున్నా.. నిధులకొరత, మౌలిక వనరుల సమస్య, పర్యావరణ క్లియరెన్సులు ఆలస్యం కావడం ఇత్యాది కారణాల వల్ల భారీ ప్రాజెక్టులేవీ నిర్మించలేకపోయాము. కానీ పాకిస్థాన్ దూకుడుకు కళ్లెం వేయాలంటే ఇండస్ జలవనరుల ప్రవాహాన్ని అడ్డుకోవడం లేదా, వాటర్ బాంబ్ ఆయుధం ప్రయోగించడం సరైన ప్రతీకార చర్య అని వాదనలు వినిపిస్తున్నాయి.
నిజానికి ఎగువ దేశంగా ఎక్కువ నీటి వాటా కలిగిన భారత్ ఇలాంటి సమాయాల్లో జలవనరులను యుద్ధ ఆయుధంగా వాడగలదా అనేది సందేహమే..
వాటర్ బాంబ్ ఆయుధం అంటే?
ఎగువదేశం ఎక్కువ నీటిని నిల్వచేసి సడెన్ గా దానిని దిగువకు వదిలితే దిగువ దేశం తుడిచిపెట్టుకుపోతుంది. సింధు నదీ జలవనరులపై పట్టు కలిగిన మనం పాకిస్థాన్ మీద ఈ అస్త్రం ప్రయోగించాలన్నా సాధ్యం కాదు. ఎందుకంటే మన డ్యామ్ లన్నీ పాకిస్థాన్ సరిహద్దుకు చాలా దూరంలో ఉన్నాయి.సింధూ నదిపై ప్రస్తుతం ఉన్న ప్రాజెక్టుకు ఎగువన ఇంకో ప్రాజెక్టు కడితే మాత్రమే నీళ్ళు ఆపడం సాధ్యం. అది ఇంకో ఐదారేళ్ళ వరకూ సాధ్యం కాదు. అంతేకాదు హిమాలయ పర్వతాల సమీపంలో ఉన్న నదులు కాబట్టి బంక మట్టి, బురద ఎక్కువగా ఉంటుంది. రిజర్వాయర్లు, డ్యామ్ లుకూడా ఈ బురదతోనే ఎక్కువ నిండిపోతాయి.ఈ సిల్ట్ ను ఒక్కసారిగా వాటర్ బాంబ్ లా ప్రయోగిస్తే పాకిస్థాన్ ను ఇది దారుణంగా దెబ్బ తీయడం ఖాయం.
చైనా అండ..
ప్రస్తుతం చైనా, పాకిస్థాన్ ఒకదానితో ఒకటి అంటకాగుతున్నాయి.మనం పాకిస్థాన్ కు ఎగువ దేశం అయితే మనకు చైనా ఎగువ దేశం.. మన బ్రహ్మపుత్రా నది బేసిన్ లో చైనా,టిబెట్ లలో నదుల నీళ్లు వచ్చి చేరుతున్నాయి.2016లో కశ్మీర్ లో మిలిటెంట్ దాడి జరిగినప్పుడు పాక్ ను ఉద్దేశించి రక్తం, నీరు కలగలసి ప్రవహించలేవంటూ భారత్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది. ఆవెంటనే చైనా యార్లంగ్ నది నుంచి బ్రహ్మపుత్రా నదిలోకి వచ్చే ఉప నదిని బ్లాక్ చేసేసింది. ఇది తమ మిత్రదేశమైన పాక్ పై చర్యలు తీసుకుంటే తమ వైఖరి అని చెప్పకనే చెప్పడం.. పైగా బ్రహ్మపుత్రానది బేసిన్ లోకి దారి తీసే నదులన్నింటిపైనా చైనా లెక్కలేనన్ని ఆనకట్టలు కట్టేసింది. మాగ్జిమమ్ నీటిని వాడేసుకుంటోంది. భవిష్యత్తులో ఎద్దడి తలెత్తిన సమయంలో చైనా నీటిని కిందకు వదలకుండా వాడేసుకుంటే మన దేశం చాలా ఇబ్బందులు పడే అవకాశం ఉంది.అసోం, ఒడిసా లాంటి రాష్ట్రాలు నీటి కొరతతో ఇబ్బందులు పడతాయి.
అలాగే వర్షాకాలంలో బ్రహ్మ పుత్రా బేసిన్ లో ఎగువ నదుల నుంచి వరదనీరు వచ్చిపడుతుంటుంది. అలాంటి చోట చైనా ప్రపంచంలోకే అతిపెద్ద డ్యామ్ ను నిర్మిస్తోంది. డ్యామ్ నిర్మాణం మన దేశానికి కూడా రిస్కే.. ఒక వేళ భూ కంపాలు లాంటి ప్రమాదాలు జరిగి ఆనకట్ట తెగితే భారత్ లో సగం ప్రాంతాలు కొట్టుకుపోవడం ఖాయం.. అయితే చైనా ప్రమాదాలు రాకుండా చర్యలు చేపడతామని పైపై కబుర్లు చెబుతోంది. తాజా పరిణామాల నేపధ్యంలో చైనా, పాకిస్థాన్ అత్యంత వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నందున పాకిస్తాన్ పై మనం దాడి చేస్తే చైనా ఆదేశానికి మద్దతు తెలిపే ప్రమాదముంది.అలాగే పాకిస్థాన్ పై మనం వాటర్ బాంబ్ ను ప్రయోగిస్తే చైనా మనపై ఈ ఆయుధం ప్రయోగించదన్న గ్యారంటీ లేదు. ఎందుకంటే పాకిస్థాన్, చైనా పరస్పర సహకారంతో సరిహద్దుల దురాక్రమణకు పాల్పడుతున్నాయి.కాబట్టి వాటర్ బాంబ్ ప్రయోగిస్తే నష్టపోయేది మనమే..
అలాగే బ్రహ్మపుత్రా బేసిన్ లో వేసవిలో నీటి కొరత ఏర్పడుతుంది.
ఇప్పటికే యార్లంగ్ త్సాంగ్ పో నదిపై కుప్పలు తెప్పలుగా ఆనకట్టలు కట్టి నీటిని వాడేస్తున్న చైనా దిగువకు నీరు విడుదల చేయకుండా అడ్డుకుంటే మనం అల్లాడిపోవాల్సి వస్తుంది. కాబట్టి ఇలాంటి సమయంలో ఇండస్ నదీ జలాల ఒప్పందాన్ని రద్దు చేసుకోవడం అనేది భారత్ కు అంత సులభం కాదు.. వాటర్ బాంబ్ ప్రయోగం కూడా సాధ్యం కాదు.. ఇవి కేవలం పాకిస్థాన్ ను హెచ్చరించడానికి భారత్ చేసిన ప్రకటనే అయినా పాకిస్థాన్ మాత్రం నానా యాగీ చేసేస్తోంది.