జమ్ము కశ్మీర్కు హిందువులు రావొద్దంటూ వెతికి మరీ.. ఒక్కొక్కరిని వాకబు చేసి మరీ మారణ హోమానికి పాల్పడిన ముస్లిం ఉగ్రవాదులు.. అక్కడ ఉండే ముస్లిం కుటుంబాలకు కూడా తీరని బాధలను మిగిల్చారు. ఈ దాడితో అక్కడి పర్యాటకం తీవ్ర సంక్షోభంలో మునిగిపోయింది. టూరిజమే ప్రధాన ఆదాయంగా, టూరిస్టులే ఆధారంగా జీవనోపాధి పొందుతున్న అక్కడి ముస్లిం కుటుంబాలు తమ ప్రధాన జీవనాధారాన్ని కోల్పోయారు. వాళ్లంతా ఇప్పుడు పని లేక, కుటుంబం ఎలా గడవాలన్న ఆవేదనలో మునిగిపోయారు. పర్యాటకుల రాకపోకలు పూర్తిగా నిలిచిపోవడంతో చిరు వ్యాపారులు, ఉపాధి లేక దుకాణాలు, హోటళ్లలో పనిచేసే చిరుద్యోగులు, ఆయా వ్యాపార సంస్థల యజమానులు కూడా తాము బతికేదెలా అని ఆందోళనతో ప్రశ్నిస్తున్నారు. జమ్మూ కశ్మీర్లోని పహల్గాంలో చూసుకుంటే.. తొలినుంచీ పర్యాటక పరిశ్రమే స్థానికులకు ప్రధాన బతుకుదెరువు. ఎక్కడెక్కడి నుంచో, దేశ విదేశాల నుంచి వచ్చే పర్యాటకులకు అక్కడ మాత్రమే దొరికే వస్తువులు అమ్మడం ద్వారా, దుకాణాల్లో పర్యాటకులకు అవసరమైన వస్తువులు, చిరుతిళ్లు, నీళ్లు, ఆహారం అమ్మకాల ద్వారా కొందరు ఉపాధి పొందుతున్నారు. మరికొందరు రెస్టారెంట్లు, హోటళ్లు నిర్వహిస్తూ.. స్తానికులకు కూడా ఉపాధి కల్పిస్తూ.. పర్యాటకుల అవసరాలు భోజనం, బస సదుపాయాలు కల్పిస్తున్నారు. అలాంటి వాళ్ల దగ్గర వివిధ రకాల పనులు చేస్తూ స్థానికులు కూలీలుగా, ఉపాధి పొందుతున్నారు.
అనుకోని ఉగ్రవాదుల దాడితో ఆ ప్రాంతంలో ఇప్పుడు భయానక, గంభీర వాతావరణం నెలకొంది. పర్యాటకులందరూ పహల్గాం నుంచి తిరిగి వెళ్లిపోయారు. అక్కడే ఉండే కొందరు స్థానికులు కూడా తాత్కాలికంగా సురక్షిత ప్రాంతాలకు వెళ్లి పోయారు. ఈ పరిణామాలతో పహల్గాం ప్రాంతంలో దుకాణాలు, హోటళ్లు మూతపడ్డాయి. పరిస్థితి ఇలాగే కొనసాగితే తాము బతికేదెలా అని వ్యాపారులు, అక్కడ పనిచేసే కూలీలు, చిరు వ్యాపారులు కూడా ఆందోళన చెందుతున్నారు. ఇలాంటి పరిస్థితి తమకు గతంలో ఏనాడూ ఎదురుకాలేదని అవేదన వ్యక్తంచేస్తున్నారు.