చైనా అధ్యక్షుడు జిన్పింగ్ ఈ మధ్య విదేశీ పర్యటనకు వెళ్లారు. మాములుగా ఆయన ఒక దేశానికి వెళ్లడమే చాలా అరుదు. అలాంటిది ఒకేసారి మూడు దేశాలను చుట్టి వచ్చారు. వియత్నాం, మలేషియా, కంబోడియాలో ఆయన పర్యటించారు. ఈ పర్యటనకు ముఖ్య కారణం భయమే అనే ప్రచారం జరుగుతోంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధించిన టారిఫ్ల ఎఫెక్ట్తోనే జిన్పింగ్ ఇప్పుడు దేశాన్నీ వీడి.. ఇతర దేశాల్లో పర్యటించి.. వాటితో సఖ్యత పెంచుకునేందుకు చర్చలు జరిపారు.
ట్రంప్ ఇప్పటికే అన్ని దేశాలపై టారిఫ్ల అమలును ఆపారు కానీ.. చైనా విషయంలో మాత్రం కనికరించేది లేదన్నారు. దీంతో 145 శాతం టారిఫ్లు అమలవుతున్నాయి. అన్నీ కలుపుకుంటే ఇది 245 శాతం ఉంటుంది. కానీ ట్రంప్కు తలొగ్గేది లేదన్నట్టుగా 125 శాతం టారిఫ్లను అమెరికాపై విధించింది. అంతేకాదు అమెరికాకు అత్యంత ముఖ్యమైన లోహాల ఎగుమతులను నిలిపివేసింది. మరి ఇప్పుడు ఇవన్నీ ఎవరికి అమ్మాలి? ఎవరికో ఒకరికి విక్రయించకపోతే చైనాలో ఉన్న పరిశ్రమలకు భారీ దెబ్బే అని చెప్పాలి. అందుకే ఇప్పుడు ఆసియా దేశాలపై ప్రేమ కురిపిస్తున్నారు జిన్పింగ్.
ఇప్పటికే చైనా వియత్నాం, మలేషియా, కంబోడియాలతో ఒప్పందాలు చేసుకున్నారు. మనమంతా కలిసి ముందుకు వెళ్లాలని చెప్పారు. మరి ఈ దేశాలు చైనా ఉత్పత్తులను కొనుగోలు చేసేందుకు సిద్ధంగా ఉన్నాయా? లేవా? అనేది ఇప్పుడు అసలు క్వశ్చన్. ఈ మూడు దేశాలు అటు అమెరికాతో, ఇటు చైనాతో వాణిజ్యం కొనసాగిస్తున్నాయి. ట్రంప్ ఎలాగైతే నా అమెరికానే లాభపడాలి.. నా అమెరికానే సంపన్న దేశంగా ఉండాలి అనుకుంటున్నారో.. అలాగే ఆ దేశాలు కూడా ఆలోచిస్తున్నాయి. అందుకే తమకు లాభసాటిగా ఉన్న దేశాలతోనే వ్యాపారాలు చేస్తున్నాయి.
కానీ ఇక్కడ రెండు విషయాలు మాత్రం క్లియర్కట్గా అర్థమవుతున్నాయి. ఒకటి .. ఏ చైనా అయితే ఆసియా దేశాలతో పెత్తనం సాగించాలనుకుందో.. ఆ చైనానే ఇప్పుడు ఆయా దేశాల దోస్తీ కోసం కుస్తీలు పడుతుంది. ఇక రెండు.. ట్రంప్ పుణ్యమా అని చైనా మరోసారి గ్లోబల్ లీడర్గా ఎదిగే అవకాశం వచ్చింది అనుకుంటోంది చైనా. అందుకే ఈ సమయంలోనే ఆసియా దేశాలను ఒక్కతాటిపైకి తెచ్చి.. తన ఆర్థిక పరపతిని మంచితనంతో పెంచుకోవాలనుకుంటోంది. మరి ఈ ప్రయత్నాలు ఎంత వరకు సఫలమవుతాయో చూడాలి. ఒకటి ఒకటి మాత్రం నిజం.. చైనా అందితే జుట్టు.. లేదంటే కాళ్లు పట్టుకునే టైప్. ఈ విషయాన్ని మాత్రం ఆ దేశాలు మరవకూడదు.