- కాళేశ్వరంలో జోరుగా ఏర్పాట్లు
జయశంకర్ భూపాల పల్లి జిల్లాలోని కాళేశ్వరం పుణ్యక్షేత్రంలో నిర్వహించనున్న సరస్వతీ నదీ పుష్కరాలకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు ఘనంగా చేస్తోంది. ఈ యేడాది మే 15వ తేదీ నుంచి 26వ తేదీ వరకు సరస్వతీ నది పుష్కరాలు జరగనున్నాయి. భక్తులు ఈ సమయంలో భారీ సంఖ్యలో వచ్చే అవకాశం ఉండటంతో వాళ్లకు ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్ల కోసం దేవాదాయ శాఖ రూ.25 కోట్లు మంజూరు చేసింది.
ఈ క్రమంలోనే మంత్రి కొండా సురేఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. భక్తుల సౌకర్యార్థం మౌలిక సదుపాయాలు మెరుగుపరచాలని సూచించారు. స్నాన ఘట్టాలు, రోడ్ల విస్తరణ, డ్రైనేజీ నిర్మాణాలు వంటి పనులు ప్రాధాన్యతతో కొనసాగుతున్నాయని అధికారులు మంత్రికి వివరించారు.
పుష్కరాల ప్రాముఖ్యత :
దేశంలోని అన్ని ప్రధాన నదుల మాదిరిగానే.. సరస్వతీ నది పుష్కరాలు ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి జరుగుతాయి. బ్రహ్మణుడైన పుష్కరుడు చేసిన తపస్సుకు మెచ్చిన శివుడు ఆయనకు వరంగా “నీవు ప్రవేశించిన నది పునీతం అవుతుంది” అని ఆశీర్వదించినట్లు పురాణకథనం. బృహస్పతి గ్రహం రాశి మార్చినప్పుడు పుష్కరుడు ఆయా నదుల్లో ప్రవేశిస్తాడు. 2025లో బృహస్పతి మిథున రాశిలోకి ప్రవేశించనున్నందున సరస్వతీ నది పుష్కరాలు జరగనున్నాయి.
యేడాది మొత్తం జరిగే పుష్కరాలలో.. మొదటి 12 రోజులు “ఆది పుష్కరాలు”, చివరి 12 రోజులు “అంత్య పుష్కరాలు”గా భావిస్తారు. ఈ సమయంలో పుణ్యస్నానాలు, పితృకార్యాలు, దానధర్మాలు విశేష ఫలితాలనిస్తాయని విశ్వాసం.
కాళేశ్వరం ప్రత్యేకత :
కాళేశ్వరం త్రివేణి సంగమంగా పేరుగాంచింది. ఇక్కడ గోదావరి, ప్రాణహిత, సరస్వతీ నదులు కలిసి ప్రవహిస్తాయని భావిస్తారు. సరస్వతీ నది అంతర్వాహినిగా భూమిలోపలే ప్రవహిస్తుందని స్థల పురాణాలు చెబుతాయి. కాశీ క్షేత్రానికి ప్రత్యామ్నాయంగా భావించే ఈ క్షేత్రంలో పిండ ప్రదానాలు, వైదిక కార్యాచరణలు నిర్వహించడం ఆనవాయితీగా ఉంది.
ఇతర పుష్కర క్షేత్రాలు :
గుజరాత్లోని సిద్ధపూర్, మానా ప్రాంతాల్లో కూడా సరస్వతీ పుష్కరాలు జరుగుతాయి. సరస్వతీ నది శివాలిక్ కొండలలో పుట్టి హిమాచల్ ప్రదేశ్, హర్యానా, రాజస్థాన్, గుజరాత్ గుండా ప్రవహించి అరేబియా సముద్రంలో కలుస్తుంది.