నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ కస్టడీలో ఉన్న ఉగ్రవాది, ముంబై ఉగ్రదాడుల మాస్టర్మైండ్ తహవూర్ రాణా విచారణ కొనసాగుతోంది. NIA హెడ్క్వార్టర్స్లో ఉన్న స్పెషల్ సెల్లో ఉంచి అతడిని విచారిస్తున్నారు అధికారులు. రాణా అధికారులకు మూడు రిక్వెస్ట్లు పెట్టుకోగా వాటికి అంగీకరించారు. తనకు ఖురాన్ కావాలని కోరగా.. ఆ కాపీని అందించారు. మరోవైపు తనకు ఓ పెన్ను, పేపర్ కావాలని అధికారులను కోరాడు రాణా. వాటిని కూడా అందించారు.
తమ కస్టడీలో ఉన్న రాణాకు ప్రత్యేక వసతులు, సదుపాయాలు ఏమీ అందించడం లేదని.. సాధారణంగా అరెస్ట్ అయినప్పుడు ఎలాంటి సదుపాయాలు ఉంటాయో వాటినే కొనసాగిస్తున్నామంటున్నారు. ఇక NIA హెడ్ క్వార్టర్స్ వద్ద మాత్రం భద్రతను కట్టుదిట్టం చేశారు.
స్పెషల్ సెల్లో ఉన్న రాణా రోజుకు ఐదు సార్లు నమాజు చేస్తున్నట్టు తెలిపారు NIA అధికారులు. అతను ముస్లిం విశ్వాసాలను పక్కాగా ఫాలో అవుతాడంటున్నారు. ఇక విచారణలో అతడి నుంచి కీలక విషయాలను రాబట్టేందుకు ప్రయత్నిస్తున్నారు.
ముఖ్యంగా ముంబై దాడులకు ముందు అతడు చేసిన ఫోన్ కాల్స్.. మరో కుట్రదారు డేవిడ్ హెడ్లీతో మాట్లాడిన సంభాషణలపై ఫోకస్ చేస్తున్నారు. దాడులకు ముందు ఎవరెవరిని కలిశాడు? ఎందుకు కలిశాడు? అనే దానికి సంబంధించిన వివరాలను తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు.
రాణా దాడులకు ముందు దుబాయ్లో ఓ వ్యక్తిని కలిసినట్టు NIA గుర్తించింది. అతడికి ఈ దాడులకు ఏమైనా సంబంధం ఉందా? రాణా ఇలాంటి కుట్రకు పాల్పడుతున్నట్టు అతడికి ముందే తెలుసా? అనే కోణంలో కూడా దర్యాప్తు చేస్తున్నారు. వీటితో పాటు ఈ దాడులకు లష్కరే తొయిబా హస్తం ఉందని తేలిపోయింది. అయితే పాక్ ఐఎస్ఐ హస్తంపై కూడా అతడి నుంచి కీలక వివరాలు రాబట్టే ప్రయత్నం చేస్తున్నారు.