ఇవాళ మధ్యాహ్నం యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ (UPI) లో సాంకేతిక సమస్య తలెత్తడంతో డిజిటల్ చెల్లింపులు కాసేపు పూర్తిగా నిలిచిపోయాయి. దేశవ్యాప్తంగా చాలా మంది వినియోగదారులు డిజిటల్ పేమెంట్స్ చేయలేకపోయారు. పేటీఎం, ఫోన్పే, గూగుల్ పే వంటి ప్రముఖ డిజిటల్ పేమెంట్ యాప్లు పనిచేయకపోవడంతో వినియోగదారులు తీవ్ర అసహనానికి గురయ్యారు. దీనికి సంబంధించి సోషల్ మీడియాలో విస్తృతంగా పోస్టులు పెడుతున్నారు.
సరిగ్గా ఇవాళ మధ్యాహ్నం 12 గంటల సమయంలో మొదలైన ఈ సాంకేతిక సమస్య కొంతసేపు కొనసాగింది. ఆ సమయానికి దాదాపు 1200 మంది యూజర్లు.. యూపీఐ చెల్లింపుల్లో సమస్యల గురించి రిపోర్ట్ చేశారు. అందులో 66 శాతం మంది పేమెంట్ సమయంలో సమస్య ఎదురయ్యిందని, మిగిలిన 34 శాతం మంది ఫండ్ ట్రాన్స్ఫర్ జరగలేదని తెలిపారు.
ఇటీవల మార్చి నెలాఖరులోనూ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఖాతాదారులు ఇదే విధమైన టెక్నికల్ ఇబ్బందుల వల్ల యూపీఐ పేమెంట్స్ చేయలేకపోయారు.
షాపింగ్ మాల్స్, బిల్లుల చెల్లింపులు, మనీ ట్రాన్స్ఫర్లు ఇలా ప్రతీదానికీ డబ్బులు ట్రాన్స్ఫర్ చేయడం కష్టంగా మారింది. వీకెండ్ కావడంతో షాపింగ్కు వెళ్లినవారు, జేబులో డబ్బు లేకుండా బయటకు వెళ్లిన వాళ్లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పర్యవేక్షణలో పనిచేసే నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) రూపొందించిన ఇన్స్టంట్ డిజిటల్ ట్రాన్సాక్షన్ సిస్టం యూపీఐ, దీని ద్వారా పేటీఎం, ఫోన్పే, గూగుల్ పే వంటి థర్డ్ పార్టీ యాప్ల ద్వారా ఎలాంటి ఛార్జీలు లేకుండా మొబైల్ నెంబర్ లేదా బ్యాంకు ఖాతాకు క్షణాల్లో డబ్బు బదిలీ చేయొచ్చు. ఈ సర్వీసులను దేశ ప్రజలందరూ వినియోగించుకుంటున్నారు.
అయితే, ఇవాళ ఉన్నట్టుండి యూపీఐ సర్వీసులు ఎందుకు డౌన్ అయ్యాయో అధికారిక సమాచారం ఇంకా రాలేదు. యూపీఐ ప్లాట్ఫామ్ నుంచి ఎటువంటి ప్రకటన కూడా విడుదల కాలేదు. దీంతో క్యాష్ లేని వినియోగదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఇలాంటి పరిస్థితుల్లో మనీ ట్రాన్స్ఫర్ చేయాల్సిన అవసరం ఉంటే, ప్రత్యామ్నాయంగా నగదు అందుబాటులో ఉంచుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.