వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఇంటర్మీడియట్లో చేరబోయే విద్యార్థులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలకమైన ఆప్షన్ అందుబాటులోకి తెచ్చింది. ఇప్పటివరకు రాష్ట్రంలో ఎంపీసీ (Maths, Physics, Chemistry), బైపీసీ (Biology, Physics, Chemistry), సీఈసీ (Civics, Economics, Commerce) వంటి సంప్రదాయ కోర్సులు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. అయితే, ఇప్పుడు 2025-26 విద్యా సంవత్సరం నుంచి ఎంబైపీసీ (Maths, Biology, Physics, Chemistry) గ్రూపును ప్రారంభిస్తోంది.
సైన్స్, మెడికల్ రంగాలపై ఆసక్తి ఉన్నవారు సాధారణంగా బైపీసీను ఎంచుకుంటారు. గణితశాస్త్రం, ఇంజినీరింగ్ లాంటి మార్గాల్లోకి వెళ్ళాలనుకునేవారు ఎంపీసీని తీసుకుంటుంటారు. కానీ రెండు రంగాల్లోనూ ఆసక్తి ఉన్నవారికి సరైన ఆప్షన్ లేకపోవడంతో కొంతమంది తమ ఆసక్తికి విరుద్ధంగా కోర్సులు ఎంచుకునే పరిస్థితి ఏర్పడుతోంది.
ఈ పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం ఇప్పుడు ఎంబైపీసీ అనే మిశ్రమ గ్రూపును ప్రవేశపెడుతోంది. ఇందులో విద్యార్థులు గణితం, జీవశాస్త్రం రెండింటినీ చదవవచ్చు. దీని వలన ఇంటర్ పూర్తయ్యాక విద్యార్థులు ఇంజనీరింగ్, మెడికల్ రెండు రంగాలకు ఆప్షన్ ఉంటుంది.
ఎంబైపీసీ ద్వారా విద్యార్థులు తమ ఆసక్తులు, లక్ష్యాల ఆధారంగా విభిన్నమైన కెరీర్ మార్గాలను ఎంచుకునే అవకాశం పొందతారు. ప్రభుత్వ కాలేజీలతో పాటు ప్రైవేట్ ఇంటర్మీడియట్ కాలేజీల్లో కూడా ఈ గ్రూపును అందుబాటులోకి తీసుకువచ్చేలా చర్యలు తీసుకుంటున్నట్టు ఇంటర్ బోర్డు సెక్రటరీ కృతికా శుక్లా తెలిపారు.
అయితే, ఈ గ్రూపును అన్ని కాలేజీల్లో అమలు చేయాలంటే తగిన ఫ్యాకల్టీ, వసతులు ఉండాలి. అందువల్ల ఇది ఎలా అమలు చేస్తారన్న విషయమై స్పష్టత అవసరం ఉందని విద్యావేత్తలు సూచిస్తున్నారు. సరైన ప్లానింగ్ లేకపోతే విద్యార్థులు అసౌకర్యానికి లోనయ్యే అవకాశం ఉందని వారు చెబుతున్నారు.