- పోలీసు అధికారులకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు ఆదేశం
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థులపై నమోదు చేసిన కేసులను వెంటనే ఉపసంహరించు కోవాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు పోలీసు అధికారులను ఆదేశించారు. సోమవారం డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ సచివాలయంలో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ టీచర్స్ అసోసియేషన్, సివిల్ సొసైటీ గ్రూప్స్ తో సబ్ కమిటీ సభ్యులైన మంత్రులు దుదిల్ల శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తో కలిసి చర్చలు నిర్వహించారు. ఆ తర్వాత డిప్యూటీ సీఎం ఈ కీలక ఆదేశాలు జారీ చేశారు. జ్యూడిషియల్ రిమాండ్ లో ఉన్న ఇద్దరు విద్యార్థులకు సంబంధించి కేసుల ఉపసంహరణకు వెంటనే చర్యలు చేపట్టాలని ఉప ముఖ్యమంత్రి పోలీసు ఉన్నతాధికారులకు సూచించారు. కేసుల ఉపసంహరణ క్రమంలో ఎటువంటి న్యాయపరమైన సమస్యలు ఉత్పన్నం కాకుండా పోలీస్ అధికారులకు తగు సూచనలు చేయాలని అటు న్యాయశాఖ అధికారులను డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆదేశించారు.