తెలంగాణలో బీసీ రిజర్వేషన్ల విషయమై బీజేపీ, బిఆర్ఎస్ పార్టీలు రాజకీయ నాటకాలు ఆడుతున్నాయని మంత్రి పొన్నం ప్రభాకర్ తీవ్రంగా విమర్శించారు. బీసీలకు రాజకీయ, విద్య, ఉద్యోగాల్లో 42% రిజర్వేషన్లు కల్పించే చట్టాన్ని తెలంగాణ శాసనసభలో ఆమోదించడంపై కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి మంత్రి పొన్నం ప్రభాకర్, టిపిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, బిసి ఎమ్మెల్యేలు, ఎంపీలు కృతజ్ఞతలు తెలిపారు. తెలంగాణకు చెందిన మంత్రి పొన్నం ప్రభాకర్తో పాటు.. పలువురు కాంగ్రెస్ నాయకులు.. ఢిల్లీలో సోనియాగాంధీని కలిశారు.
ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మీడియాతో మాట్లాడుతూ, అసెంబ్లీలో బీసీ కోటాకు బిజెపి మద్దతు తెలిపినప్పటికీ, ఇప్పుడు వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేయడం బీజేపీ ద్వంద్వ వైఖరికి నిదర్శనమని పేర్కొన్నారు. ప్రధాని మోడీ ఇడబ్యుఎస్ కోటాలో 10% రిజర్వేషన్లు కల్పించారని, కేవలం 10-12% జనాభా ఉన్న ఓసీలకు రిజర్వేషన్లు ఎలా ఇచ్చారని ప్రశ్నించారు. బిసిల కోసం 42% రిజర్వేషన్లకు అడ్డంకులు ఎందుకు సృష్టిస్తున్నారని మండిపడ్డారు. ఇడబ్యుఎస్లో ముస్లింలకు రిజర్వేషన్లు ఇచ్చిన బీజేపీ.. బీసీలకు అదే విధంగా రిజర్వేషన్లు ఇవ్వకుండా ఎలా సమర్చుకుంటుందని పొన్నం నిలదీశారు. బీసీల హక్కుల విషయంలో రాజకీయ లబ్ధి కోసం ప్రయత్నించడం సరికాదని ఆయన అన్నారు.
టిపిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ, బిసిలు, మైనార్టీల కోసం కాంగ్రెస్ ప్రభుత్వం నిజమైన చిత్తశుద్ధితో పనిచేస్తోందని, కులగణన చేయడం ద్వారా బిసిలకు న్యాయం చేయాలని సంకల్పించామని తెలిపారు. గుజరాత్లో బిసిల జాబితాలో ముస్లింలకు రిజర్వేషన్లు కల్పిస్తున్న సంగతి గుర్తు చేశారు.
ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద బిసి సంఘాలు, తెలంగాణ కాంగ్రెస్ నేతలు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్వహించిన ధర్నా కూడా బిసిల హక్కుల కోసం కాంగ్రెస్ పోరాటానికి నిదర్శనమని మహేష్ కుమార్ గౌడ్ తెలిపారు. బిసిలు తమ హక్కులు సాధించుకునే వరకు కాంగ్రెస్ పార్టీ వెనక్కి తగ్గదని స్పష్టం చేశారు.