కంచ గచ్చిబౌలి భూముల వివాదంపై సుప్రీం కోర్టు గురువారం విచారణ నిర్వహించింది. ఈ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వ తీరుపై జస్టిస్ గవాయ్ ధర్మాసనం తీవ్రంగా స్పందించింది. మూడురోజుల వ్యవధిలో వంద ఎకరాల భూమిలో చెట్లు నరకడం సాధారణ విషయం కాదని వ్యాఖ్యానించింది.
సుమోటోగా కేసును స్వీకరించిన ధర్మాసనం, హెచ్సీయూ భూముల్లో ఎలాంటి పనులు చేయరాదని ఆదేశాలు జారీ చేసింది. తదుపరి ఆదేశాలు వచ్చే వరకు తెలంగాణ ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకోవద్దని పేర్కొంది. విచారణ సందర్భంగా తెలంగాణ హైకోర్టు రిజిస్ట్రార్ పంపిన మధ్యంతర నివేదికను పరిశీలించిన కోర్టు, మీడియా కథనాలను కూడా గమనించింది.
తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారిని ప్రతివాదిగా చేర్చిన సుప్రీం కోర్టు, భూముల్లో చెట్లు తొలగించాల్సిన అత్యవసరం ఎందుకు ఏర్పడిందని ప్రశ్నించింది. దీనిపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నుంచి అఫిడవిట్ దాఖలు చేయాలని ఆదేశించింది.
ప్రభుత్వం నెల రోజుల్లోపు నిపుణుల కమిటీ వెయ్యాలని అత్యున్నత న్యాయస్థానం ఆదేశించింది. ఆ కమిటీ ఆరు నెలలలోపు నివేదిక ఇవ్వాలని సుప్రీం కోర్టు సూచించింది. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీ సభ్యులు కూడా తమ స్పందన ఇవ్వాలని కోర్టు ఆదేశించింది. చట్ట ఉల్లంఘనలపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి వ్యక్తిగత బాధ్యత వహించాల్సి ఉంటుందని తెలిపింది. అటవీ ప్రాంతం కాకపోయినా, చెట్లు తొలగించడానికి సీఈసీ అనుమతి తీసుకున్నారా? అని ప్రశ్నించింది. హైకోర్టు రిజిస్ట్రార్ నివేదికలోని ఫోటోలు పరిస్థితిని స్పష్టంగా చూపిస్తున్నాయని ధర్మాసనం వ్యాఖ్యానించింది. కంచ గచ్చిబౌలి భూముల వ్యవహారంపై తాత్కాలిక స్టే విధించింది.