సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టినందుకు చిత్తూరు టీడీపీ శాసనసభ్యుడు గురజాల జగన్ మోహన్ అనుచరులు తనపై దాడి చేశారని చిత్తూరు 5వ డివిజన్ వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ మురళీధర్ రెడ్డి ఆ పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్.జగన్ మోహన్ రెడ్డికి చెప్పారు. బుధవారం వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్.జగన్ని కలసిన మురళీధర్ రెడ్డి చిత్తూరు జిల్లా కొంగరెడ్డిపల్లిలో తనపై టీడీపీ నాయకులు చేసిన దాడికి సంబంధించి సీసీ కెమెరా విజువల్స్ చూపించారు. కేవలం సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టినందుకు ఎమ్మెల్యే అనుచరులు తనపై దాడి చేసి తీవ్రంగా గాయపరచారని మురళీధర్ రెడ్డి మాజీ ముఖ్యమంత్రికి వివరించారు. సీసీ టీవీ ఫుటేజ్ తోపాటు మురళీధర్ రెడ్డి శరీరంపై ఉన్న దెబ్బలను చూసిన వైఎస్.జగన్మోహన్రెడ్డి మురళి కుటుంబానికి న్యాయం జరిగేవరకూ పూర్తి అండగా ఉంటామని హామీ ఇచ్చారు. అవసరమైన న్యాయ సహాయం కూడా అందిస్తామని అతనికి వైఎస్ జగన్ భరోసా ఇచ్చారు. చిత్తూరు వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ విజయానందరెడ్డి నేతృత్వంలో ఈ రోజు చిత్తూరు పట్టణ నాయకులు వైఎస్.జగన్ని కలిసారు.
- Advertisement with us -