ఓ వైపు వరుస ఎన్కౌంటర్లు.. మరోవైపు పదుల సంఖ్యలో మృతి చెందుతున్న మావోయిస్టులు.. ఒకప్పుడు కంచుకోటగా ఉన్న దండకారణ్యాన్ని ఈజీగా జల్లెడ పట్టెస్తున్న భద్రతా బలగాలు.. దీంతో మావోయిస్టులు ఇప్పుడు దిగొచ్చారు. మరింత నష్టం జరగకముందే అలర్టయ్యారు. ఇప్పుడు కేంద్రంతో చర్చలు సిద్ధమని అనౌన్స్ చేశారు. కాల్పుల విరమణ ప్రకటించి.. వెంటనే శాంతి చర్చలు జరపాలంటూ ఓ లేఖ విడుదల చేసింది.
ఆపరేషన్ కగార్ పేరుతో మావోయిస్టుల ఏరివేతను కొనసాగిస్తోంది కేంద్ర ప్రభుత్వం. దీనిపై మావోయిస్టులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. గత 15 నెలలుగా కగార్ పేరుతో యుద్ధాన్ని తీవ్రతరం చేశారని.. ఈ యుద్ధంలో ఇప్పటి వరకు 400కు పైగా మృతి చెందారని.. ఇందులో చాలా మంది సాధారణ ఆదివాసీ ప్రజలే అని చెబుతున్నారు మావోయిస్టులు. దీనికి మావోయిస్టు కేంద్ర కమిటీ అధికార ప్రతినిధి అభయ్ పేరుతో ఓ లెటర్ను రిలీజ్ చేశారు.
తాము శాంతి చర్చలకు ఎప్పుడైనా సిద్ధమే అంటున్నారు మావోయిస్టులు. ఈ చర్చల కోసం సానుకూల వాతావరణాన్ని ఏర్పాటు చేయాలని ప్రతిపాదిస్తున్నారు. వెంటనే ఆపరేషన్ కగార్ను నిలిపివేయాలని.. కొత్త క్యాంప్ల ఏర్పాటును నిలిపివేయాలని ప్రతిపాధిస్తున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఈ ప్రతిపాదనలకు సానుకూలంగా స్పందిస్తే తక్షణమే కాల్పులు విరమణ ప్రకటిస్తామంటున్నారు. తాము చేసిన ప్రతిపాదనల విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఒత్తిడి తీసుకురావాలని మేధావులను కోరారు మావోయిస్టులు.
ప్రస్తుతం చత్తీస్గఢ్ అభయారణ్యంలో భద్రతా బలగాలు పైచేయి సాధిస్తున్నాయి. మావోయిస్టులను మట్టుపెట్టడంలో దూసుకుపోతున్నారు. రోజురోజుకు మావోయిస్టుల కంచుకోటను దెబ్బతిస్తూ.. కొత్త క్యాంప్లను ఏర్పాటు చేస్తున్నారు. ఇటీవల లొంగిపోయే మావోయిస్టుల సంఖ్య కూడా పెరుగుతోంది. మొత్తానికి మావోయిస్టుల అస్థిత్వాన్నే దెబ్బతీసే పనిలో ఉంది కేంద్రం. అంతేకాదు వచ్చే ఏడాది పూర్తయ్యే నాటికి మావోయిస్టులు అనే వారిని పూర్తిగా ఏరివేస్తామని కేంద్రహోంమంత్రి అమిత్ షా ఇప్పటికే ప్రకటించారు కూడా. ఇలాంటి సమయంలో శాంతి చర్చల ప్రతిపాదన తీసుకొచ్చారు మావోయిస్టులు. మరి ఈ చర్చల ప్రతిపాదనను కేంద్రం సీరియస్గా తీసుకుంటుందా? లేదా? చూడాలి.