దేశంలోని మిగతా రాష్ట్రాలతో పాటు.. ప్రపంచంతో పోటీ పడేలా తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడమే లక్ష్యంగా అనేక కార్యక్రమాలు చేపడుతున్నామని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ప్రకటించారు. హైదరాబాద్ రవీంద్ర భారతిలో జరిగిన ఉగాది వేడుకల్లో భట్టి విక్రమార్క ప్రసంగిస్తూ.. రాష్ట్ర ప్రభుత్వం ఈ వార్షిక సంవత్సరానికి ప్రవేశపెట్టిన బడ్జెట్ ద్వారా, ప్రజా ప్రభుత్వం అందిస్తున్న పాలనను మరింత మెరుగు పరుస్తామన్నారు. ప్రపంచంతో పోటీ పడాలనే ఆలోచనతో అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. అందులో భాగంగానే ఫ్యూచర్ సిటీ నిర్మాణం, హైదరాబాద్ నగర అభివృద్ధితో పాటు అన్ని జిల్లాలను కలుపుతూ రీజనల్ రింగ్ రోడ్, కొత్త విమానాశ్రయాల నిర్మాణం చేయాలని రాష్ట్రంలో నివాసం ఉంటున్న ప్రజలందరి భవిష్యత్తు కోసం రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి మంచి సంకల్పంతో పనిచేయడానికి ముందుకు పోతున్నదని తెలియజేశారు.
శ్రీ విశ్వావసు నామ సంవత్సరంలో తెలంగాణ రాష్ట్ర ప్రజలు సుభిక్షంగా ఉండాలని, మంచి వర్షాలతో పాడి పంటలతో విలసిల్లాలని, పారిశ్రామీకీకరణ అభివృద్ధి చెందాలని, ఎటువంటి ఇబ్బంది లేకుండా శాంతిభద్రతలతో మంచి పాలన అందించాలన్న సంకల్పంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో యావత్తు మంత్రి మండలి మంచి సంకల్పంతో ముందుకు పోతున్నందున రాష్ట్ర ప్రజలందరికీ మేలు జరుగుతుందని భట్టి ఆకాంక్షించారు. పరిపాలనతో పాటు ప్రజలందరూ మధురానుభూతులతో తీపి చేదు కారం వగరు ఉప్పు పులుపు లాంటి రుచులతో ఉగాది పచ్చడిని ఎలా సేవిస్తామో అలాంటి షడ్రుచులతో తెలంగాణ రాష్ట్ర ప్రజల జీవితాలు ఆనందమయంగా ఉండాలని రాష్ట్ర ప్రభుత్వం కోరుకుంటున్నదన్నారు.
రాష్ట్ర ప్రజలందరికీ అన్ని రకాల వసతులు కల్పించాలని, అన్ని వర్గాల ప్రజలకు తగిన ఏర్పాట్లు చేయాలని, ముఖ్యంగా యువత, వ్యవసాయం, పరిశ్రమలు, మహిళలు అభివృద్ధి చెందాలని ప్రభుత్వం మనస్ఫూర్తిగా కోరుకుంటున్నదన్నారు. వారు అభివృద్ధికి చెందాలని ఆశిస్తూ అందుకు తగ్గట్టుగా బడ్జెట్ పెట్టడం జరిగిందన్నారు. ఈ సంవత్సరం రాష్ట్ర ప్రజలు సుఖ సంతోషాలతో, అద్భుతమైన ఆనందాలతో, ప్రతి కుటుంబం అభివృద్ధి చెందే విధంగా విశ్వావసునామ ఉగాది సంవత్సరం అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఆకాంక్షించారు.