కొడంగల్ ప్రజలు తనకు తెలంగాణను పరిపాలించే శక్తిని ఇచ్చారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. కొడంగల్లో ఇఫ్తార్ విందు కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. పలు అంశాలపై మాట్లాడారు. కొందరికి వాళ్ల కుర్చీ పోయిందని బాధగా ఉండొచ్చని, కానీ.. అలాంటి వాళ్లను పట్టించుకోవాల్సిన అవసరం లేదని అన్నారు. తాను ఏం చేయగలనో, ఏం చేయనో, మీకంటే ఎక్కువగా ఎవరికీ తెలియదని కొడంగల్ ప్రజలను ఉద్దేశించి సీఎం రేవంత్ వ్యాఖ్యానించారు.
వక్ఫ్ బిల్లు అంశం గురించి మాట్లాడుతూ.. వక్ఫ్ బిల్లు గురించి ఎంఐఎం పక్ష నేత అక్బరుద్దీన్ ఒవైసీ కంటే ముందు తానే లేవనెత్తానని స్పష్టం చేశారు. ముస్లింలకు ఎక్కువ అవకాశాలు కల్పించింది కాంగ్రెస్ పార్టీనే అని గుర్తు చేశారు. ఆనాటి నుంచి ఇప్పటి వరకు ముస్లింల అభివృద్ధికి కాంగ్రెస్ పార్టీ కృషి చేస్తూనే ఉందని సీఎం రేవంత్ స్పష్టం చేశారు.
ఇక, కొడంగల్లో ముస్లింల అభివృద్ధి కోసం ఎమ్మెల్యే నిధుల్లో నుంచి 25 శాతం మంజూరు చేశామని సీఎం చెప్పారు. ఇక మీదట ఒక్క సంతకంతోనే కొడంగల్కు కావాల్సిన అన్ని అవసరాలు తీరుతాయని రేవంత్ భరోసా ఇచ్చారు. మీరు ఎవరి కోసమో వెతికి.. వాళ్లను ఎవరినో అడగాల్సిన అవసరం లేదన్నారు. చిన్న చిట్టీ రాసిస్తే చాలు.. తానే కొడంగల్కు వచ్చి అన్ని పనులు పూర్తి చేయిస్తా అని సీఎం హోదాలో రేవంత్ రెడ్డి భరోసా ఇచ్చారు.