-
47 మార్కెట్ కమిటీలకు చైర్మన్లను ప్రకటించిన టీడీపీ
-
సభ్యులతో కలిపి 705 నామినేటెడ్ పదవులు భర్తీ
-
అభ్యర్థుల ఎంపికకు ప్రజాభిప్రాయ సేకరణ
-
47 ఏఎంసి చైర్మన్లలో 37 టీడీపీ, 8 జనసేన, 2 బీజేపీ
-
త్వరలోనే మిగిలిన మార్కెట్ కమిటీల చైర్మన్లు ప్రకటన
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నామినేటెడ్ పోస్టులను బర్తీ చేయడం ప్రారంభించింది. తాజాగా మార్కెట్ కమిటీలకు పాలకవర్గాలనుప్రకటించారు. 47 మార్కెట్ కమిటీలకు సంబంధించి చైర్మన్లను ప్రకటించింది. ప్రకటించిన 47 ఏఏంసీ చైర్మన్ల పదవుల్లో 37 టిడిపి, 8 జనసేన, 2 బీజేపీ నాయకులకు దక్కాయి. 47 మార్కెట్ కమిటీలకు గానూ.. సభ్యులతో కలిపి 705 నామినేటెడ్ పదవులు భర్తీ చేసింది. అభ్యర్థుల ఎంపికకు పార్టీ క్యాడర్ నుంచి అభిప్రాయాలు సేకరించింది. త్వరలోనే మిగిలిన మార్కెట్ కమిటీల ఛైర్మెన్లను ప్రకటించనుంది. ఇతర కీలక పదవులనూ భర్తీ చేయనున్నారు.
ఇప్పటికే ఏపీలో 62 కార్పొరేషన్ పోస్టులు భర్తీ అయ్యాయి. వీటిని టీడీపీ 49, జనసేన 10, బీజేపీ 3 చొప్పున పంచుకున్నారు. 214 మార్కెట్ కమిటీలు, 1100 ట్రస్ట్ బోర్డ్స్లో నామినేటెడ్ పదవులు ఉన్నాయి. అంటే 1,314 పోస్టులు ఉన్నాయి. వీటికోసం ఏకంగా 60 వేల అప్లికేషన్లు వచ్చాయి. తొలి విడతగా 47 ఏఏంసీ చైర్మన్ల పదవుల్నిప్రకటించారు. పార్టీ కోసం కష్టపడిన వారికే అవకాశాలు కల్పిస్తామని టీడీపీ హైకమాండ్ ఇప్పటికే ప్రకటించింది. కష్టపడిన వారి గుర్తింపు కోసం ప్రత్యేకంగా కసరత్తు చేశారు. ఇక, ఆలయ పాలక మండళ్ల వివరాలు కూడా రావాల్సింది. 21 ప్రధాన దేవాలయాలకు చైర్మన్లను నియమించాల్సి ఉంది. నామినేటెడ్ పదవుల కోసం 60వేల దరఖాస్తులు వచ్చాయని, వాటిని నిశితంగా పరిశీలిస్తున్నామని ఇటీవల సీఎం చంద్రబాబు తెలిపారు. మొదటిసారే పదవులు రాలేదని అనుకోవద్దని, రెండేళ్ల పదవీకాలం ముగిశాక మిగిలినవారికి కూడా అవకాశాలు కల్పిస్తామన్నారు. ఇప్పటికే పదవులు తీసుకున్నవారి ప్రతిభను పర్యవేక్షిస్తున్నామన్న బాబు.. ప్రతిపక్షంలో ఉన్నట్లే ఇప్పుడు హుందాగా వ్యవహరించాలని నేతలకు సూచించారు. సరైన వ్యక్తులను సరైన పదవుల్లో నియమిస్తాని చంద్రబాబు చెప్పారు. ఇప్పుడు కొన్ని పదవులు ప్రకటించినా ఇంకా భర్తీ చేయాల్సిన పదవులు పెద్ద ఎత్తున ఉన్నాయి. ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీల మధ్య సీట్ల పంపకానికి అనుసరించిన సూత్రాన్నే పోస్టుల భర్తీలోనూ పరిగణనలోకి తీసుకుంటున్నారు. కష్టకాలంలోనూ టీడీపీని అంటిపెట్టుకుని అత్యంత విధేయత, అంకితభావం, చిత్తశుద్ధితో పని చేసిన వారికి ప్రాధాన్యమిచ్చారని చెబుతున్నారు. నామినేటెడ్ పోస్టుల భర్తీలో సామాజిక న్యాయానికి పెద్దపీట వేస్తూనే, యువతకు ప్రాధాన్యమిచ్చినట్లుగా టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. క్యాడరే లీడర్ అనే సందేశం ఇస్తూ అంకితభావం ఉన్న వారికి అందలం ఎక్కించింది. సామాన్య కార్యకర్తలకు పెద్దపీట వేస్తూ బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు అగ్ర తాంబూలం ఇచ్చింది. సామాజిక సమతూకంతో పాటుగా యువతకు ప్రాధాన్యం కల్పించామని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు.