నల్గొండ జిల్లా నకిరేకల్ పట్టణం కడపర్తి రోడ్ లోని ఎస్ఎల్ బీసీ బాలుర గురుకుల పాఠశాల సెంటర్ లో తెలుగు పేపర్ లీక్ కలకలం రేపింది. జిల్లా విద్యాశాఖ, పోలీసుల నిర్లక్ష్యంతోనే ఇది బయటపడిందని ఆరోపణలు వస్తున్నాయి. శుక్రవారం ఉదయం విద్యార్దులకు ప్రశ్నా పత్రం ఇచ్చిన 10 సెకన్ ల వ్యవధిలోనే సోషల్ మీడియాలో ప్రశ్నాపత్రం చక్కర్లు కొట్టింది. పేపర్ లీక్ వ్యవహారంలో విద్యాశాఖ అధికారుల ప్రమేయంపై విద్యార్ది సంఘాలు అనుమానం వ్యక్తం చేస్తున్నాయి. విషయం బయటకు పొక్కకుండా అధికారులు జాగ్రత్త పడ్డారు.
గుట్టు చప్పుడు కాకుండా విచారణ చేపట్టారు. ఎగ్జామ్ సెంటర్ లోకి మొబైల్ ఎలా వెళ్లిందనే దానిపై ఆరా తీస్తున్నారు. ఎగ్జామ్ సెంటర్ నుంచి వాట్సాప్ ద్వారా ప్రశ్నపత్రం బయటకు వచ్చింది. క్షణాల్లో సదరు ఎగ్జామ్ సెంటర్ కు జీరాక్స్ ద్వారా ఆన్సర్ షీట్స్ అందించారన్న ఆరోపణలు వచ్చాయి. ప్రైవేట్ స్కూల్స్ తో విద్యాశాఖ అధికారులు కుమ్మక్కైనట్టు విద్యార్ది సంఘాల ఆరోపణ. నిజంగా పేపరు లీకేజీ జరిగితే 5.1 లక్షల మంది విద్యార్థులపై ప్రభావం పడనుంది. బాధ్యులైన అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటేనే ఇలాంటివి పునరావృతం కావని విద్యావేత్తలు చెపుతున్నారు.