మాములుగా తప్పు చేసినా.. హత్య చేసినా.. నిందితుల్లో ఒక రకమైన భయం ఉంటుంది. తాము తప్పు చేశామన్న అపరాధభావమో.. లేక దొరికిపోతామన్న టెన్షనో ఉంటుంది వారిలో. కానీ కట్టుకున్న భర్తను ప్రియుడితో కలిసి చంపి.. ముక్కలు ముక్కలుగా నరికిన తర్వాత వారి పరిస్థితి ఎలా ఉంటుంది? మాములుగా వణికిపోవాలి వారు. కానీ దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన మీరట్ మర్డర్ కేసులో అలా జరగలేదు. ప్రియుడితో కలిసి భర్తను చంపిన తర్వాత నిందితులు మనాలీ, కసోల్ ట్రిప్కు వెళ్లారు. బర్త్డే చేసుకున్నారు. హోళీ వేడుకల్లో పాల్గొన్నారు. మొత్తంగా చూస్తే ఈ మర్డర్ తర్వాత వారు సెలబ్రేషన్స్ చేసుకున్నారు ఆ నిందితులు.
మీరట్లో సంచలనం సృష్టించిన సౌరభ్ రాజ్పుత్ కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. భార్య ముస్కాన్ రస్తోగి.. ఆమె ప్రియుడు సాహిల్ శుక్లా.. ఇద్దరు కలిసి పార్టీలు చేసుకున్నారు. మనాలీలో కొన్ని రోజులు.. ఆ తర్వాత కసోల్లో ఆరు రోజుల పాటు ఉన్నారు. ఎక్కువగా బయటికి రాకుండా హోటల్ గదికే పరిమితమైన వారు చేసుకున్న సంబరాల వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి.
మీరట్కు చెందిన సౌరభ్ రాజ్పుత్ అదే ఏరియాలో ఉంటున్న ముస్కాన్ రస్తోగిని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. 2016లో వీరిద్దరు వివాహం చేసుకున్నారు. 2019లో వీరికి ఓ పాప కూడా జన్మించింది. అదే సమయంలో ఆమెకు తన పాత ఫ్రెండ్ సాహిల్ పరిచయమయ్యాడు. ఆ పరిచయం వివాహేతర సంబంధానికి దారి తీసింది. ఆ సంబంధమే ఇప్పుడు సౌరభ్ హత్యకు కారణమైంది. లండన్లో ఉద్యోగం చేస్తున్న సౌరభ్.. తన కూతురు బర్త్ డే ఉందని చెప్పి గత నెల తిరిగి ఇంటికి వస్తున్నట్టు ముందుగానే చెప్పాడు. ఈ విషయం ముస్కాన్కు, సాహిల్కు ఇద్దరికి నచ్చలేదు. దీంతో సౌరభ్ను కడతేర్చేందుకు పక్కా ప్లాన్ వేశారు. ప్లాన్ ప్రకారం మార్చి 4న అతని డ్రింక్లో నిద్రమాత్రలు కలిపి స్పృహ కోల్పోయాక అతడిని పొడిచి చంపేశారు ముస్కాన్, సాహిల్. ఆ వెంటనే అతని బాడీని 15 ముక్కల కింద నరికి ఓ డ్రమ్లో వేశారు. అందులో సిమెంట్ కలిపి గడ్డకట్టేలా చేశారు.